రూ.30,000 వరకు పెరగనున్న ధరలు
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఆగస్టు నుంచి తన కార్ల ధరలను రూ.30,000 వరకు పెంచనున్నట్లు మంగళవారం ప్రకటించింది. పెరిగిపోతున్న ముడి పదార్థాల వ్యయాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తోన్నట్లు వెల్లడించింది. గత కొన్ని నెలలుగా పెరుగుతున్న ముడి సరుకుల భారాన్ని తగ్గించుకునేందుకు పలు రకాల వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు కంపెనీ తెలిపింది. అయితే ద్రవ్యోల్బణ ఒత్తిడి అధికంగా ఉండటం, ప్రతికూల వ్యయ వాతావరణం కొనసాగుతుండటంతో ఈ భారాన్ని కొంతవరకు వినియోగదారులపై మోపక తప్పడం లేదని మారుతి సుజుకి పేర్కొంది. కస్టమర్లపై ప్రభావం కనీస స్థాయిలో ఉండేలా చూస్తూనే అనివార్య పరిస్థితుల్లో ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ధరల పెంపు రూ.30,000 వరకు ఉంటుందని స్పష్టం చేసినప్పటికీ.. ఏ మోడల్పై ఎంత పెరుగుతుందనే పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. మోడల్ను బట్టి ఈ ధరల పెరుగుదల భిన్నంగా ఉంటుందని తెలిపింది.
మరోవైపు దేశంలోని ఇతర ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు కూడా ఇటీవలి కాలంలో తమ వాహనాల ధరలను పెంచాయి. టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వాహనాల ధరలను జులై 1 నుంచి 1.5 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా జూన్ 1 నుంచి రూ.12,800 వరకు ధరలను పెంచింది. అలాగే కియా ఇండియా కూడా జులై 1 నుంచి 2 శాతం వరకు ధరలను సవరించింది. పెరుగుతున్న ముడి పదార్థాల ధరలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయా కంపెనీలు వెల్లడించాయి.








కామెంట్లు (0)