- న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ
న్యూయార్క్: పాఠశాలల్లో విద్యార్థుల కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంపై న్యూయార్క్ నగరం కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 విద్యా సంవత్సరంలో 8వ తరగతి వరకు విద్యార్థులు జనరేటివ్ ఏఐ సాధనాలను ఉపయోగించకుండా ఏడాది పాటు తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల సుమారు 6 లక్షల మంది విద్యార్థులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. 2-K నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు ఉపయోగించే సాఫ్ట్వేర్లో విద్యార్థులను నేరుగా లక్ష్యంగా చేసుకునే జనరేటివ్ ఏఐ, చాట్బాట్లను నిలిపివేయనున్నారు. ప్రస్తుతం పాఠశాలల్లో వినియోగిస్తున్న దాదాపు 40 ఏఐ ఆధారిత విద్యా సాధనాలను కూడా తొలగించడం లేదా వాటి ఏఐ ఫీచర్లను నిలిపివేయడం జరుగుతుంది. ఏఐపై అధికంగా ఆధారపడటం వల్ల విద్యార్థుల ఆలోచనా శక్తి, సమస్యలను స్వయంగా పరిష్కరించే సామర్థ్యం, ఉపాధ్యాయులు మరియు తోటి విద్యార్థులతో ప్రత్యక్ష సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని మమ్దానీ ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఏడాది కాలంలో ఏఐ ప్రభావాన్ని అధ్యయనం చేసి, భవిష్యత్లో పాఠశాలల్లో సాంకేతికత వినియోగంపై సమగ్ర విధానాన్ని రూపొందించనున్నారు.
అయితే హైస్కూల్ విద్యార్థులకు పూర్తిగా ఏఐ నిషేధం ఉండదు. ఎంపిక చేసిన కార్యక్రమాల్లో పర్యవేక్షణతో ఏఐ వినియోగానికి పరిమిత అనుమతి ఇవ్వనున్నారు. విద్యార్థులకు ఏడాదిలో రెండుసార్లు ఏఐ లిటరసీ తరగతులు నిర్వహించి, సాంకేతికతపై విమర్శనాత్మక ఆలోచన, దాని ప్రయోజనాలు, ప్రమాదాలపై అవగాహన కల్పించనున్నారు. ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళికలు, పరిపాలనా పనుల కోసం ఏఐను ఉపయోగించుకోవచ్చు. అయితే విద్యార్థుల గ్రేడింగ్ వంటి మూల్యాంకన ప్రక్రియల్లో ఏఐ వినియోగంపై పరిమితులు కొనసాగనున్నాయి. న్యూయార్క్ నగర పాఠశాల వ్యవస్థ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో విద్యా రంగంలో ఏఐ వినియోగంపై జరుగుతున్న చర్చకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది.







కామెంట్లు (0)