mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Stock markets – నష్టాల్లో భారత స్టాక్ మార్కెట్లు ..!

11 జూన్, 2026

Indian stock markets in the red..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 11, 2026, 04:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బిజినెస్ : దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో మళ్లీ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచడంతో రోజంతా మార్కెట్లు ఒడిదొడుకులకు గురయ్యాయి. ముఖ్యంగా ఐటి రంగ షేర్లలో భారీ అమ్మకాలు చోటుచేసుకోవడంతో కీలక సూచీలపై ఒత్తిడి పెరిగింది. చివరకు సెన్సెక్స్‌ 150.63 పాయింట్లు కోల్పోయి 73,832.55 వద్ద ముగియగా, నిఫ్టీ 53.35 పాయింట్లు తగ్గి 23,161.60 వద్ద స్థిరపడింది. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.95.75 వద్ద నమోదైంది. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచే సెన్సెక్స్‌ బలహీనంగా కనిపించింది. గత ముగింపు 73,983.18 పాయింట్లతో పోలిస్తే 73,615.99 వద్ద ప్రారంభమైన సూచీ, మధ్యాహ్నం కొంత కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి చేరి 74,394.34 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. అయితే ఆ ఊపు ఎక్కువసేపు కొనసాగలేదు. అనంతరం మళ్లీ అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీ నష్టాల్లోకి జారుకుని 73,832.55 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 30 షేర్లలో ఐటి రంగానికి చెందిన ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు నష్టపోగా, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎటర్నల్‌ షేర్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మరోవైపు మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, సన్‌ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాలతో ముగిసి మార్కెట్‌కు కొంత మద్దతునిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలోనూ కీలక వస్తువుల ధరలు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ చమురు ధర బ్యారెల్‌కు 92 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ధర ఔన్సుకు 4,092 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ పరిణామాలు, ముడి చమురు ధరల కదలికలు, విదేశీ పెట్టుబడిదారుల ధోరణి రానున్న రోజుల్లో దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్