సెన్సెక్స్ 374 పాయింట్ల పతనం
ముంబయి : అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు, అమెరికా-ఇరాన్ మధ్య తలెత్తిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాలను చవిచూశాయి. ముడిచమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకడం, అంతర్జాతీయ బాండ్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో మదుపర్లు ఆందోళనకు గురయ్యారు. ఈ పరిణామాలతో బుధవారం బిఎస్ఇ సెన్సెక్స్ 373.93 పాయింట్లు (0.49 శాతం) నష్టపోయి 76,570.35కు పరిమితమయ్యింది. ఇంట్రాడేలో ఏకంగా 808.56 పాయింట్లు పడిపోయి 76,135.72 కనిష్ట స్థాయిని తాకింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 141.35 పాయింట్లు (0.59 శాతం) క్షీణించి 23,914.45 వద్ద నమోదయ్యింది. అమెరికా వైమానిక దాడులు, ఇరాన్ ప్రతిస్పందన నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 0.40 శాతం పెరిగి 95.13 డాలర్లకు చేరుకుంది. దిగుమతులపై ఆధారపడే భారత్కు ఈ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణ భయాలను పెంచగా, నిఫ్టీ ఆటో, మీడియా, ఐటీ రంగాలు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయి.








కామెంట్లు (0)