ఏటవాలుగా వచ్చిన కాంతి
నీటి బిందువును ముద్దాడింది
విస్ఫోటనమేదో జరిగింది
“ఏడు రంగులుగ” విడిపోయింది!
ప్రశాంతమైన ఆకాశంలో
విశాలమైన “ఇంద్ర ధనస్స”గ
కనులకు విందు చేసింది
పిల్లల మనసునే దోచింది
“ఊదా” రంగు భలే పసందు
తరంగదైర్ఘ్యం చాలా తక్కువ
అది కొద్ది గానే వంగుంటుంది
హరివిల్లు నందు పైన వున్నది
“ముదురు నీలం, నీలం” రంగు
పక్క పక్కగా కలిసి కనపడు
‘నిక్కమైన ఒక నీలమే చాలని’
పెద్దలు చెప్పిన చాటువు పండు!
ఆ కింద రంగు “ఆకుపచ్చ”లే
పైర గాలితో పంటల మల్లె
మన జెండాలో మెరిసింది
శ్రేయస్సుకు సంకేతమది
కాంతులీనేటి వర్ణం “పసుపు”
శుభములు కూర్చే ఓ మెరుపు
పవిత్రము, ఘన ఆయుర్వేదం
ఆరోగ్యానికి దివ్యౌషధము
“కాషాయంగా” తళుక్కుమంది
ఇంద్ర ధనస్సున రంగైయింది
పతాకంలో శౌర్యానికి ప్రతీక
సమర వీరులకు స్ఫూర్తి దీపిక
చిట్టా చివరది “ఎర్రని” రంగు
తరంగదైర్ఘ్యం నిండుగ పొంగు
వంగే గుణము చాలా ఎక్కువ
వీనులకు కలిగించు మక్కువ!
ప్రకృతి ఇచ్చిన ఈ రంగులు
కలిసి తెల్లగ మారుట వింత
కపటం లేని బాలల మనస్సు
తెల్లని కాంతిగ మెరిసే నంట!
- కూచిమంచి నాగేంద్ర,
91821 27880.








కామెంట్లు (0)