ఆదివారం వర్షా కాలం అయినప్పటికీ ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం 2 గంటలు. స్కూల్ గ్రౌండ్ లో వాలీబాల్ ఆడి ఆడి రామూ, సురేష్ ఇద్దరూ చెమటలతో తడిసి ముద్దయ్యారు. ‘రామూ! నోరంతా ఎండిపోతుంది రా. వెళ్లి ఆ కోక్, ఫాంటా ఏదైనా తాగుదామా? చల్లగా ఉంటాయి కదా’ అంటూ సురేష్ దుకాణం వైపు పరుగెత్తబోయాడు. రాము వెంటనే సురేష్ చెయ్యి పట్టుకుని ఆపాడు.
‘ఆగు సురేష్! ఆ కూల్ డ్రింక్స్ వద్దు రా!. అవి చల్లగా ఉంటాయి కానీ, మన ఒంట్లో వేడి పెంచుతాయి’ అన్నాడు.
సురేష్ ముఖం చిన్నబోయింది. ‘అదేంటి రా? అందరూ తాగుతున్నారు కదా. టీవీలో కూడా హీరోలు తాగుతున్నారు. బాగుంటాయిగా!’ అన్నాడు. వెంటనే రామూ జేబులోంచి చిన్న నోట్ తీసి చూపించాడు. ‘చూడు సురేష్. మన సైన్స్ మాస్టారు చెప్పారు. ఈ కూల్ డ్రింక్స్ లో 8 స్పూన్ల చక్కెర ఉంటుందట! ఎక్కువ తాగితే పళ్లు పుచ్చిపోతాయి, కడుపులో గ్యాస్ వస్తుంది. ఇంకా ఒబేసిటీ కూడా వస్తుందట’ అన్నారు.
‘అయ్యో! అంత ప్రమాదమా?’ అన్నాడు సురేష్ భయంగా.
‘అవునురా. మన శరీరానికి ఎండలో నిజంగా కావాల్సింది చల్లదనం + నీళ్లు + శక్తి. అవి కూల్ డ్రింక్స్ లో లేవు.’ అన్నాడు రాము.
‘మరి ఏం తాగుదాం?’ అన్నాడు సురేష్. రామూ చుట్టూ చూసి వేలితో దగ్గర్లో ఉన్న బండి చూపించాడు. ‘అదిగో అక్కడ చూడు. మావయ్య నిమ్మరసం బండి. పక్కనే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం కూడా ఉన్నాయి.’ అన్నాడు. ఇద్దరూ ఆ బండి దగ్గరికి వెళ్లారు. మావయ్య చల్లని గ్లాసు నిమ్మరసం ఇచ్చి పైన కొద్దిగా జీలకర్ర, పుదీనా వేశాడు. ఒక గుక్క తాగగానే సురేష్ కళ్లు పెద్దవి చేశాడు.
‘వావ్ రామూ! ఇది సూపర్ గా ఉంది. కడుపు చల్లబడిపోయింది. ఇంకా దాహం కూడా పోయింది.’
రాము నవ్వుతూ.. ‘చూశావా? ఇదే మన దేశపు సహజ పానీయాల శక్తి. రసాయనాలు లేవు, నష్టం లేదు. పైగా మన రైతులకు కూడా ఉపయోగం.’ అన్నాడు.
డబ్బులు తీసుకుంటూ... మావయ్య కూడా ‘బాగా చెప్పావు బాబు. మా పిల్లలకు కూడా ఇవే ఇస్తా.’ తర్వాత రాము, సురేష్ ఇంటికి బయలుదేరారు.‘ఈరోజు నుండి నేను కూల్ డ్రింక్స్ కి బై చెప్పేస్తున్నా. నిమ్మరసం, లస్సీ, మజ్జిగే నా ఫ్రెండ్స్!’
రామూ తలూపుతూ ‘అంతే సురేష్. _ఆరోగ్యం కావాలంటే, సహజ పానీయాలే ముద్దు’
నీతి:చల్లదనం పేరుతో ఒంటికి హాని చేసే కూల్ డ్రింక్స్ కంటే, మన ఇంటి నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లే మేలు.
యం. హేమంత్*7వ తరగతి, తిరువూరు.








కామెంట్లు (0)