పునరావాస కేంద్రంలో ఏర్పాట్ల పరిశీలన
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి) : గోదావరి వరదల నేపథ్యంలో ఆల్కట్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సోమవారం ఉదయం కమిషనర్ రాహుల్ మీనా పరిశీలించారు. పునరావాస కేంద్రంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి తరలించారనే పూర్తి సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 260 మంది పునరావాస కేంద్రంలో ఉన్నట్లు అధికారులు కమిషనర్ కు తెలిపారు. ఈ సందర్భంగా బాధితులను పరామర్శించి అక్కడి సదుపాయాలపై ఆరా తీశారు. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మెడికల్ క్యాంపును పరిశీలించి ఎవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం కోటిలింగాల ఘాట్, పుష్కర్ ఘాట్, రివర్ ఫ్రంట్ సహా క్షేత్రస్థాయిలో పర్యటించి వరద పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. వరద తగ్గుముఖం పట్టినప్పటికి అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. ప్రజలు వరద నీటిలోకి వెళ్లకుండా, ప్రమాదకర ప్రాంతాలకు చేరకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట ఎస్ఈ రీటా, ఈఈలు మదర్షా అలీ, మాధవి, ఎంహెచ్ఓ వినూత్న, డీఈలు, ఇతర సిబ్బంది ఉన్నారు.








కామెంట్లు (0)