శాసనమండలి సమావేశాల నేపథ్యంలో దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణ
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి : వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో తొలి నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సోమవారం తిరస్కరించారు. ఆగస్టు 17 నుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధిగా తన విధులు నిర్వర్తించేందుకు పరిమిత కాలానికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అనంతబాబు కోర్టును కోరారు. ఈ పిటిషన్పై ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపించారు.అనంతబాబు తన పిటిషన్లో తాను తూర్పుగోదావరి స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎన్నికైన సిట్టింగ్ ఎమ్మెల్సీనని పేర్కొన్నారు. శాసనమండలి సమావేశాలకు హాజరై ప్రజల సమస్యలను, ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. కోర్టు నిర్దేశించే షరతులకు లోబడి పూచీకత్తులు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నానని, సమావేశాలు ముగిసే వరకు మాత్రమే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు.అయితే ప్రాసిక్యూషన్ ఈ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించింది. అనంతబాబు హత్యతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టం కింద నమోదైన తీవ్రమైన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారని పేర్కొంది. గతంలో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన సమయంలో ప్రాసిక్యూషన్ సాక్షులను ప్రభావితం చేసేందుకు, ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించి బెయిల్ షరతులను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకువచ్చింది.సాక్షులను ప్రలోభపెట్టిన వ్యవహారానికి సంబంధించి క్రైమ్ నంబర్ 155/2026 కింద మరో కేసు నమోదైందని, దర్యాప్తులో భాగంగా సాక్షుల నుంచి రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రాసిక్యూషన్ తెలిపింది. బెయిల్ షరతుల ఉల్లంఘన నేపథ్యంలో గతంలో మంజూరైన బెయిల్ను మే 13, 2026న కోర్టు రద్దు చేసిందని వివరించింది.ఎమ్మెల్సీగా ఉన్నంత మాత్రాన క్రిమినల్ కేసు విచారణ నుంచి లేదా న్యాయపరమైన కస్టడీ నుంచి ప్రత్యేక మినహాయింపు లభించదని ప్రాసిక్యూషన్ వాదించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆగస్టు 31 నాటికి ప్రాసిక్యూషన్ సాక్ష్యాధారాల ప్రక్రియను, నవంబర్ 30 నాటికి మొత్తం విచారణను పూర్తి చేయాల్సి ఉందని పేర్కొంది.ఇంకా సీసీటీవీ ఫుటేజీకి సంబంధించిన కస్టోడియన్లు, మధ్యవర్తులు, నిపుణులైన కీలక సాక్షులను విచారించాల్సి ఉందని తెలిపింది. ఈ కీలక దశలో నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే మిగిలిన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, తద్వారా స్వేచ్ఛాయుతమైన విచారణకు ఆటంకం కలిగే ప్రమాదం ఉందని ప్రాసిక్యూషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.అనంతబాబు గత నేర చరిత్రను కూడా ప్రాసిక్యూషన్ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. 2014లో ఆయనపై రౌడీషీట్ తెరిచినట్లు, అనంతరం 2019లో దానిని మూసివేసినట్లు పేర్కొంది. ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనంతబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు.








కామెంట్లు (0)