త్వరలోనే వంద పడకల నూతన భవనం ప్రారంభం: ఎమ్మెల్యే నల్లమిల్లి
అదనపు వసతుల కోసం రూ.15 కోట్ల నిధులు మంజూరుకు కృషి
ప్రజాశక్తి, అనపర్తి (తూర్పు గోదావరి) : నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో '102 - తల్లీ బిడ్డా ఎక్స్ప్రెస్' వాహనాన్ని స్థానిక శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనపర్తి ఏరియా ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తయిందని, త్వరలోనే దీనిని అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. అయితే ఆసుపత్రి పూర్తి స్థాయి అభివృద్ధి మరియు ఇతర వసతుల కోసం అదనంగా మరో 15 కోట్ల రూపాయల నిధులు అవసరముందని, ఈ నిధులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించే దిశగా కృషి చేస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రుల సహకారంతో ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామన్నారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులతో మాట్లాడి వివరాలు సేకరించారు. కాగా, ఈ నూతన తల్లీ బిడ్డా ఎక్స్ప్రెస్ వాహనంలో మొదటిసారిగా తోకాడ గ్రామానికి చెందిన ప్రసవించిన బాలింత, శిశువు ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.







కామెంట్లు (0)