ప్రజాశక్తి-రాజమహేంద్రవరం సిటీ : తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ విద్యావేత్త, తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ నున్న సురేష్ (52) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు (కల్లపరు) టోల్గేట్ సమీపంలో చోటుచేసుకుంది.
సమాచారం మేరకు నున్న సురేష్ తన సతీమణి విమల దేవితో కలిసి హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వైపు కారులో ప్రయాణిస్తుండగా టోల్గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో నున్న సురేష్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్య విమల దేవికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు తిరుమల విద్యాసంస్థల అధినేత నున్న తిరుమలరావు సోదరుడు కావడం గమనార్హం. నున్న సురేష్ మృతి వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యా సంస్థల సిబ్బంది, విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. నున్న సురేష్ ఆకస్మిక మరణం పట్ల పలువురు విద్యావేత్తలు, ప్రజా ప్రతినిధులు, వివిధ వర్గాల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.







కామెంట్లు (0)