బాలికోన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థినుల సందడి
ప్రజాశక్తి - అనపర్తి : స్థానిక శ్రీమతి ద్వారంపూడి బుల్లెమ్మాయి బాలికల ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థినులు ఆదివారం సందడి చేశారు. ఈ పాఠశాలలో 1983-84 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన సుమారు 20 మంది పూర్వ విద్యార్థినులు సుదీర్ఘ కాలం తర్వాత ఒకేచోటుకు చేరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. దాదాపు 42 సంవత్సరాల క్రితం తాము చదువుకున్న పాఠశాల ప్రాంగణాన్ని, తరగతి గదులను వారు ఎంతో ఆసక్తిగా తిలకించారు. బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. తాము కూర్చున్న స్థలాలను చూపిస్తూ ఆనాటి మధుర స్మృతులను నెమరవేసుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ, కుటుంబ విశేషాలను పంచుకుంటూ పరవశించిపోయారు. ఆటపాటలతో, అల్లరి కేకలతో కాసేపు చిన్న పిల్లలుగా మారిపోయి పాఠశాల ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొల్పారు. తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం కొంత నగదును విరాళంగా అందజేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. అనంతరం మధురమైన జ్ఞాపకాలను మనసులో నింపుకొని ఎవరి ఊర్లకు వారు తిరుగు ప్రయాణమయ్యారు.







కామెంట్లు (0)