-1.3 కిలోల గంజాయి స్వాధీనం, తొమ్మిది మంది అరెస్టు
తెనాలి రూరల్ (గుంటూరు) : గంజాయి విక్రయాలు, వినియోగంపై తెనాలి రూరల్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నంది వెలుగు బ్రిడ్జి కింద గంజాయితో ఉన్న తొమ్మిదిమందిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1,300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను తెనాలి రూరల్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెనాలి డీఎస్పి బి. జనార్దనరావు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ... నందివెలుగు ప్రాంతంలో కొందరు వ్యక్తులు గంజాయి సేవిస్తూ, విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించి వ్యూహాత్మకంగా దాడి చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద తనిఖీలు నిర్వహించగా 1,300 గ్రాముల గంజాయి లభించిందన్నారు. పట్టుబడ్డ నిందితుల సమాచారం మేరకు గుంటూరు చుట్టుకుంట ప్రాంతానికి చెందిన ప్రధాన సరఫరాదారుడు షేక్ షఫీతో పాటు మరొక నిందితుడిని గుర్తించి దాడి చేసి అరెస్ట్ చేశామన్నారు. నిందితులపై గతంలోనూ పలు కేసులు నమోదైనట్లు డీఎస్పి తెలిపారు. ప్రస్తుత ఘటనపై ఎన్డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలను సేవించడం, క్రయవిక్రయాలు నిర్వహించడం, అక్రమంగా రవాణా చేయడం చట్టరీత్యా నేరమని డిఎస్పి స్పష్టం చేశారు. ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి విక్రయాలు, రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన కోరారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను అరెస్ట్ చేసిన సిఐ షేక్ నాయబ్ రసూల్, ఎస్సైలు కె ఆనంద్, ఎన్.సి ప్రసాద్, సిబ్బందిని డిఎస్పి అభినందించారు.







కామెంట్లు (0)