ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : మంగళగిరి తెనాలి ఫ్లై ఓవర్ క్రింద ఆగి ఉన్న లారీలో ప్లాస్టిక్ ట్రే ల దొంగతనానికి పాల్పడ్డాడని నెపంతో వ్యక్తిని లారీ డ్రైవర్, లారీ యజమాని కుమారుడు కలిసి అనుమానితుడిని స్తంభానికి కట్టేసి కొట్టడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లి శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటన సంచలనం కలిగించింది. మంగళగిరి తెనాలి ఫ్లైఓవర్ పై ఓ లారీ ఆగింది. ఆ సమయంలో ఒక వ్యక్తి లారీలో ఉన్న ప్లాస్టిక్ ట్రేలు దొంగతనానికి పాల్పడ్డారని అనుమానంతో లారీ డ్రైవర్ ,లారీ యజమాని కుమారుడు ఆ వ్యక్తిని కట్టేసి కొట్టారు. దీనితో ఆ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో తరలిస్తున్న సమయంలో ఆ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పాత మంగళగిరి కి చెందిన మేకల చిన్న రమేష్ గా పోలీసులు గుర్తించారు. మృతుని భార్య మేకల కల్పన. తన భర్త చిన్న రమేష్ ను మామిడి నాయుడు, రాజు కలిసి దారుణంగా కొట్టి చంపినట్లుగా మంగళగిరి పట్టణ సిఐ కు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మృతుడు దళితుడు కావడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేశారు. శనివారం డిఎస్పి విచారణ చేపట్టారు. మృతుని రమేష్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. డిగ్రీ, ఇంటర్మీడియట్ చదువుతున్నారు.
కెవిపిఎస్ ఖండన ....
దొంగతనం పేరుతో మేకల చిన్న రమేష్ స్తంభాన్ని కట్టేసి దారుణంగా కొట్టి చంపడాన్ని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు వై కమలాకర్ తీవ్రంగా ఖండించారు. కొట్టి చంపిన మామిడి నాయుడు, రాజులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకి విన్నవించారు.






కామెంట్లు (0)