సొరంగం నుండి ఒకరు, బెట్రావతిలో శిథిలాల నుండి మరొకరు
ఖాట్మాండు : నేపాల్ జల ప్రళయం నుండి మరో ఇద్దరిని అధికారులు శనివారం రక్షించారు. రసువాలోని జల విద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలో చిక్కుకుపోయిన ఇద్దరిని శుక్రవారం అధికారులు రక్షించిన సంగతి తెలిసిందే. అదే సొరంగం నుండి శనివారం ఒక చైనీయుడిని అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. నువాకోట్ జిల్లాలోని బెట్రావతిలో శిథిలాల కింద కూరుకుపోయిన నాలుగు అంతస్తుల భవనం పైఅంతస్తు నుండి 60 ఏళ్ల మహిళను రక్షించారు.
త్రిశూలి-1 జలవిద్యుత్ ప్రాజెక్టులోని ఒక సొరంగం లోపల చిక్కుకుపోయిన లుహైతావోను నేపాలీ సైన్యం, విదేశీ సహాయక బృందాలు సంయుక్తంగా శనివారం రక్షించినట్లు నేపాల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. సొరంగం లోపల సుమారు 225 మీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రదేశం నుండి లుహైతావోను బయటకు తీశారని, ప్రస్తుతం అతని ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నారని పేర్కొంది. తాజా చర్యతో త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగం నుండి ముగ్గురుని రక్షించినట్లు సైన్యం తెలిపింది.
అలాగే బిదుర్ మున్సిపాలిటీ-10లోని ఒక ఇంటిలో 60 ఏళ్ల మహిళ చండికా శ్రేష్ఠను అపస్మారక స్థితిలో గుర్తించారని, ఆమెను రక్షించినట్లు 'ద ఖాట్మాండు పోస్ట్' శనివారం తెలిపింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన సాయుధ పోలీసు దళం ఆమెను రక్షించిందని, అనంతరం ప్రాథమిక చికిత్స కోసం ఆమెను హెలికాప్టర్లో త్రిశూలిలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొంది. అవసరమైతే తదుపరి చికిత్స కోసం ఆమెను ఖాట్మాండుకు తీసుకువెళ్లనునన్నట్లు నేపాల్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
ఇదిలా వుండగా, నేపాల్ మృతుల సంఖ్య 1344కి చేరింది. 4,900మంది గల్లంతయ్యారు.





కామెంట్లు (0)