అదుపు తప్పిన కారు.. నలుగురికి గాయాలు
ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసేందుకు రవాణా శాఖ అధికారులు నిర్వహించే డ్రైవింగ్ టెస్ట్ లో అపశృతి చోటుచేసుకుంది. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఆర్టిఏ అధికారులు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తుంటారు. అదే క్రమంలో బుధవారం ఓ యువతి కారు డ్రైవింగ్ లైసెన్స్ నిమిత్తం డ్రైవింగ్ టెస్ట్ కు వచ్చింది. ఆమె కారు నడుపుతున్న సమయంలో బ్రేక్కు బదులుగా పొరపాటున ఎక్సిలరేటర్ నొక్కడంతో వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి అక్కడ ఉన్న వారిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో చెంచుపేట కు చెందిన బొల్లు రాఘవరావు (75), ముత్తింశెట్టి వారి పాలెంకు చెందిన గంజాం పున్నమాచార్యులు (63), ఐతా నగర్ కు చెందిన వేము ఫ్రాంక్లిన్ (74), పాండురంగ పేట కు చెందిన కఠివరపు శారద (55) గాయపడ్డారు. వెంటనే స్పందించిన రవాణా శాఖ అధికారులు, స్థానికులు క్షతగాత్రులను పక్కనే ఉన్న జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ప్రమాదంపై మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టి రాఘవరావు మాట్లాడుతూ .... లైసెన్స్ కోసం డ్రైవింగ్ టెస్ట్ కి వచ్చిన యువతి కంగారుపడటంతో ప్రమాదం జరిగిందని, క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించామని, భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.







కామెంట్లు (0)