అమరావతిలో నిర్మాణాలను పరిశీలించిన మంత్రులు పి నారాయణ, సవిత,అనగాని సత్యప్రసాద్
ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు) : ఈ నెల 13వ తేదీన అమరావతిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవన సముదాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)కు అప్పగించడం జరుగుతుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ చెప్పారు. రాజధాని అమరావతిలో మంత్రులు పి నారాయణ, అనగాని సత్యప్రసాద్, సవిత మంగళవారం పర్యటించారు. నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ తో పాటు ఐకానిక్ భవనాలు,మంత్రుల బంగ్లాల నిర్మాణ పనులు జరుగుతున్న తీరును సహచర మంత్రులకు మంత్రి నారాయణ వివరించారు. భవనాల పరిశీలన అనంతరం రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ .... అమరావతి కోసం రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు. అబద్దాల పుట్టుక మీద పుట్టింది గొడ్డలి పార్టీ.. ఐదేళ్లు అమరావతిలో విధ్వంసం సృష్టించారని వైసిపి నుద్దేశించి అన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో ఎమ్మెల్యే క్వార్టర్లు పూర్తి కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమరావతిలో ఇతర నిర్మాణాలు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. మంత్రి నారాయణ దగ్గరుండి పనులను పరిగెత్తిస్తున్నారని అన్నారు. క్రెడిట్ చోరీలో గొడ్డలి పార్టీ నాయకులను మించిన వారు లేరన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ .... ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారని అన్నారు. గతంలో అమరావతి నిర్మాణానికి ఒప్పుకుని తర్వాత జగన్ మోహన్ రెడ్డి మాట మార్చారని, మూడు ముక్కలాటతో రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారని మండిపడ్డారు. అమరావతిపై రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తున్నామన్నారు. మంత్రి నారాయణ నిరంతరం అధికారులతో చర్చిస్తూ భవనాల నిర్మాణాలు పూర్తి చేయిస్తున్నారని, మంత్రులు,అధికారులు,ప్రజలు ఇక్కడికి వచ్చి నివాసం ఉండేలా అన్ని రకాల వసతులను కల్పిస్తున్నారని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ తో వైసిపి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని అన్నారు.భావితరాల కోసం మంచి రాజధానిని ప్రజలకు అందిస్తామన్నారు.








కామెంట్లు (0)