వలసలు ఆపి పనులు చూపలేక ఘోరంగా విఫలమైన అధికారులు, నాయకులు...
పల్లెల్లో పనులేక రోజు రోజుకి పెరుగుతున్న వలసలు...
భర్తలను వదిలి భార్యలు, బిడ్డలను వదిలి తల్లిదండ్రులు పొట్ట గడవక పనుల కోసం వలసలు వెళ్తున్న వైనం...
పల్లె పట్టణాల్లో ఉపాధి హామీ పనులు పెంచి అందరికీ పనులు కల్పించాలి...
ప్రజాశక్తి-చిలకలూరిపేట (గుంటూరు) : ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావంతో పల్లెల్లోని ఖరీఫ్ లో వ్యవసాయ పనులు లేవు. రబీ సీజన్లో పంట ల పై ఆశలు లేవు. కార్డులున్న వారికే సక్రమంగా ఉపాధి పనులను అధికారులు చూపటం లేదు. ప్రధానంగా నిత్యావసర వస్తువులు, నూనెలు, బియ్యం, తదితర వస్తువుల ధరలు విపరీతంగా పెరగటంతో పండుగ రోజుల్లో కూడా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక తప్పని సరి పరిస్థితుల్లో కుటుంబాలు గడవని స్థితిలో అర్ధాకలితో పస్టులుంటున్నామని దళిత, వ్యవసాయ కూలీల కుటుంబాలు వాపోతున్నారు. కర్నాటక, రాష్ట్రంలోని మైసూర్, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో పొగాకు పనుల నిమిత్తం ప్రజలు వలసలు పోతున్నారు. పనులు చేయలేని వృద్ధులను ఇళ్ల వద్ద కాపలా పెట్టి తమ పిల్లలను వారి వద్దనే వదిలి వెళుతున్నామంటున్నారు. నిత్యం విజయవాడ తదితర ప్రాంతాల నుంచి చిలకలూరిపేట మీదుగా బెంగళూరుకు సుమారుగా 100 బస్సులు వెళ్తుంటాయి. ఇప్పుడు ఈ కూలీలతో బస్సులకు డిమాండ్ పెరిగి రూ.900 వందలకు టిక్కెట్ మించడం లేదు. ప్రస్తుతానికి ఆ టిక్కెట్ ధర రూ.1100, రూ.1200 వందలకు పెరిగింది. అయితే ఈ సీజన్లో మండల పరిధిలో 23 గ్రామాలో దాదాపు వేల మంది దళిత కార్మికులు పనులు లేక మైసూరుకు వెళుతున్నారు. మిట్టపాలెం గ్రామానికి చెందిన సిద్దయ్య మాట్లాడుతూ .... పనుల్లేక తన భార్యను ప్రస్తు తానికి మైసూర్ కు పంపిస్తున్నానని కొద్ది రోజుల తరువాత తాను కూడా వెళతానని తెలిపాడు. వాస్తవానికి ఎన్నడు ఇటువంటి సీజన్ చూడలేదని ప్రస్తుతానికి ఖరీఫ్ సీజన్లో పొగాకు, పత్తి, మిర్చి, ఇతర పంటలు ముమ్మరమైన సాగు పనులు ఉంటాయని ... అయితే ఈ సంవత్సరం వ్యవసాయ భూమి మొత్తం ఖాళీగా ఉందని, పనులు లేక అప్పులు తీర్చలేక బాధపడుతున్నామన్నారు. అందువలన తాము వలస పోవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చిలకలూరిపేట పట్టణానికి ఆనుకునే ఉన్న యనవదల గ్రామానికి చెందిన గేరా.రాణి తన తల్లిదండ్రులను మైసూర్ కు పంపేందుకు బస్సు ఎక్కించేందుకు వచ్చానన్నారు. ప్రతి సంవత్సరము డిసెంబరు మొదటి వారంలో మైసూర్ కి పనుల కోసం పోయేవారని అయితే ఈ సంవత్సరం అసలు పనులే లేకపోవడం వలన ఇప్పుడే వలస పోవాల్సి వచ్చిందన్నారు. ఉపాధి హామీ పనులను కేవలం కార్డులు ఉన్న వారికే ఇస్తున్నారని అయితే ఈ సంవత్సరం కొత్త కార్డులను రాస్తే బాగుండేదని చెబుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఎల్ నినో ప్రభావం వలన పనులు లేని గ్రామాలను గుర్తించి ఉపాధి హామీ పనులు పెంచడమే కాకుండా అందరికి ఈ ఉపాధి హామీ పనులను కల్పించాలని కోరుకుంటున్నారు.








కామెంట్లు (0)