ప్రజాశక్తి తెనాలి(గుంటూరు జిల్లా) :
ఆస్తి వివాదం చిలికి చిలికి గాలివానగా మారి ఘర్షణకు దారితీసింది. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన పరస్పర ఘర్షణలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలో కలకలం రేపిన ఈ ఘటనపై పట్టణ వన్టౌన్ సిఐ సిహెచ్ రాంబాబు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక నాజరు పేటలో నివాసం ఉండి, ఆటో డ్రైవర్గా జీవనం సాగించే కొల్లిపర కోటేశ్వరరావు (28) కు కొంతకాలంగా తల్లిదండ్రులతో ఆస్తి వివాదంలో గొడవ జరుగుతుంది. కొల్లిపరలో ఉన్న నివేసిన స్థలాన్ని అమ్మి తనకు కొంత డబ్బు ఇవ్వాల్సిందిగా తల్లిదండ్రులపై కోటేశ్వరరావు ఒత్తిడి తెస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి వరకు పరస్పరం వాదనలు, ఘర్షణ జరిగింది. ఘర్షణలో తల్లిదండ్రులు భాస్కరరావు, విజయమ్మ, సోదరుడు మరియదాసు చేతిలో తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే మృతదేహాన్ని ఆటోలో తరలించే ప్రయత్నం చేస్తుండగా స్థానికులు 112 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిఐతో పాటు సిబ్బంది అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.








కామెంట్లు (0)