ప్రజాశక్తి-కాకినాడ : నగరంలో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, బ్యానర్లను తక్షణమే నియంత్రించాలని కాకినాడకు చెందిన పలువురు న్యాయవాదులు సోమవారం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నగరంలో విచ్చలవిడిగా వెలుస్తున్న ఫ్లెక్సీల కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, ప్రధాన రహదారులపై ఏర్పాటు చేస్తున్న భారీ ఫ్లెక్సీలతో ట్రాఫిక్కు అంతరాయం కలగడమే కాకుండా ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతోందని వారు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత జిల్లాలోనే ఫ్లెక్సీల సమస్య తీవ్ర స్థాయిలో ఉండటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. గతంలో జిల్లా యంత్రాంగం నో ఫ్లెక్సీ జోన్ గా ప్రకటించిన ప్రాంతాల్లో కూడా నిబంధనలను ఉల్లంఘిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ అంశంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలు కూడా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని వివరించిన న్యాయవాదులు, కాకినాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసి అక్రమ ఫ్లెక్సీలు, బ్యానర్లపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ను కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో న్యాయవాదులు కుంచె లారెన్స్, ఇంజ ప్రతాపరెడ్డి, నున్న వెంకట కృష్ణారావు, కరీం, వి. చక్రధర తదితర పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
అక్రమ ఫ్లెక్సీలపై కఠిన చర్యలు తీసుకోండి : కలెక్టర్కు న్యాయవాదుల వినతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 13, 2026, 04:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)