తుమ్మలగుంటలో ఆరవ రోజుకు చేరిన శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
ప్రజాశక్తి–క్యాంపస్ :తుమ్మలగుంటలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఆదివారం ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై శ్రీరాముని అలంకారంలో యాత్రికులకు దర్శనమిచ్చారు. స్వామివారి హనుమంత వాహన సేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలివచ్చారు. కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. చంద్రగిరి మండలంలోని ఎ.రంగంపేట, కందులవారిపల్లి, చిన్నరామాపురం, రామిరెడ్డిపల్లి, కొటాల, ఐతేపల్లి, ఎం.కొంగరవారిపల్లి, పనబాకం, అగరాల, కల్లూరుపల్లె పంచాయతీల నుంచి యాత్రికులు సారె తీసుకువచ్చారు. సారె తీసుకువచ్చిన యాత్రికులకు చెవిరెడ్డి మోహిత్రెడ్డి సాదర స్వాగతం పలికారు. హనుమంత వాహన సేవ సందర్భంగా కళాకారుల ప్రదర్శనలు, భజన బృందాల కార్యక్రమాలు, నృత్యాలు యాత్రికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. యాత్రికులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని వాహన సేవలో పాల్గొన్నారు.








కామెంట్లు (0)