ఆక్రమణను సహించేది లేదు : సిఐటియు మండల కన్వీనర్ నాగిపోగు పెంచలయ్య
ప్రజాశక్తి - ఓబులవారిపల్లి : తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం వై.కోట అరుంధతివాడ గ్రామానికి చెందిన సహజ వంకలు, కాలువలను ఆక్రమించి రహదారి నిర్మించేందుకు జరిగిన ప్రయత్నాన్ని సిఐటియు ఆధ్వర్యంలో గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ వంకను ఓ అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి తన స్వార్థ ప్రయోజనాల కోసం పూడ్చివేసి, దళితవాడ సరిహద్దులను ధ్వంసం చేస్తూ తన పొలానికి రహదారి వేసేందుకు ప్రయత్నించాడని గ్రామస్తులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న సిఐటియు మండల కన్వీనర్ నాగిపోగు పెంచలయ్య బాధితుల పక్షాన నిలబడి గ్రామ పెద్దలు, యువకులు, మహిళలతో కలిసి రహదారి నిర్మాణాన్ని నిలిపివేశారు. ఈ సందర్భంగా నాగిపోగు పెంచలయ్య మాట్లాడుతూ, తరతరాలుగా దళిత గ్రామానికి రక్షణగా ఉన్న సహజ వంకలను ఆక్రమించేందుకు ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా, ఎలాంటి సర్వే నిర్వహించకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమించి రహదారి వేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వ వంకలు, వాగులు, కాలువలు, ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న భూ కబ్జాదారులపై రెవెన్యూ అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, సిఐటియు కార్యకర్తలు పాల్గొన్నారు.








కామెంట్లు (0)