పశ్చిమ గోదావరి : యలమంచిలి చించినాడ లో మరో విషాదం నెలకొంది. తణుకు కు చెందిన భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో సహా గోదావరి నదిలో దూకి గల్లంతయ్యారు. తణుకుకి చెందిన నంబూరి శ్రీనివాస్గా అనే వ్యక్తి తన భార్య పద్మిని, కొడుకు,కూతుళ్లు వెంకటేశ్వర్, నిత్యశ్రీతో కలిసి చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో శ్రీనివాస్ భార్య పద్మినిని స్థానిక జాలర్లు రక్షించగా.. ఆయనతో పాటు కుమారుడు వెంకటేశ్వర్, కుమార్తె నిత్యశ్రీ గల్లంతయ్యారు. అపస్మారక స్థితిలోకి చేరిన పద్మినిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
తణుకు నంబూరి శ్రీనివాస్, పద్మిని దంపతులు స్థానికంగా వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు వెంకటేశ్వర్ పాలిటెక్నిక్ చదువుతుండగా కూతురు నిత్యశ్రీ 9 వ తరగతి చదువుతుంది. అయితే గత కొన్ని రోజులుగా వీరి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఆ కారణంగానే ఆత్మహత్యకు యత్నించిన ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం గల్లంతైన శ్రీనివాస్, అతని కొడుకు, కూతురు ఆచూకీ కోసం అధికారులు ముమ్మర గాలింపు చేపట్టారు. అయితే గత వారం క్రితం కూడా ఇదే తరహాలో ఓ కుటుంబం బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి విదితమే. కాని సకాలంలో మత్స్యకారులు స్పందించి వారిని కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది. ఆ ఘటన మరువకముందు మళ్లీ అలాంటి ఘటనే అక్కడ చోటు చేసుకోవడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.







కామెంట్లు (0)