ప్రజాశక్తి-నరసాపురం: కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ‘జైల్ భరో’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సోమవారం ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు భారీగా నరసాపురం సబ్కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్–ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్దకు తరలివచ్చారు. అక్కడ జైల్ భరో నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనకారులతో సబ్కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం ఒక్కసారిగా వేడెక్కింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ప్రజాసంఘాల నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పలువురు ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలను అక్కడికక్కడే అరెస్టు చేశారు. అనంతరం వారిని స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో ఉద్యమాలను అడ్డుకోలేరని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.









కామెంట్లు (0)