- గ్రామ ప్రజలకు దీర్ఘకాల సమస్యకు తాత్కాలిక ఉపశమనం
ప్రజాశక్తి-మైలవరం : మైలవరం మండలం వద్దిరాల గ్రామంలో నెలకొన్న తీవ్రమైన తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకున్నారు. ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు సి.భూపేష్ సుబ్బరామిరెడ్డి ప్రత్యేకంగా స్పందించి మైలవరం డ్యామ్ నుంచి పైప్లైన్ ద్వారా వద్దిరాల గ్రామానికి తాగునీటిని విడుదల చేయించారు. గత కొన్ని నెలలుగా గ్రామంలో నీటి కొరత తీవ్రంగా ఉండటంతో ప్రజలు రోజువారీ అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో పరిస్థితి మరింత కష్టతరమవుతుందని భావించిన నాయకులు తక్షణ చర్యలు చేపట్టారు. అధికారులతో సమన్వయం చేసుకుని పైప్లైన్ ద్వారా నీటి సరఫరా ప్రారంభించడంతో గ్రామానికి కొంత ఉపశమనం లభించింది. ఈ కార్యక్రమాన్ని టీడీపీ నాయకుడు, డీలర్ గంగాధర్ యాదవ్ ప్రారంభించారు. నీరు పైప్లైన్ ద్వారా గ్రామానికి చేరుతున్న దృశ్యాన్ని చూసి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో శాశ్వత తాగునీటి పథకాలు అమలు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.








కామెంట్లు (0)