న్యూఢిల్లీ : నీట్ పీజీ 2026 (NEET-PG 2026) ప్రవేశ పరీక్షకు హాజరయ్యే కొందరు అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల వివరాలు తప్పుగా వెళ్లినట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) బుధవారం వెల్లడించింది. సాంకేతిక సమస్య కారణంగా ఈ పొరపాటు జరిగినట్లు తెలిపింది. సరైన పరీక్షా కేంద్రాల వివరాలతో అభ్యర్థులకు మళ్లీ ఎస్ఎంఎస్, ఈమెయిళ్లు పంపినట్లు పేర్కొంది. అభ్యర్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రాల వివరాలను ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.
గతంలో వచ్చిన ఎస్ఎంఎస్ను పరిగణనలోకి తీసుకోకుండా అధికారిక పోర్టల్లోని వివరాలను మాత్రమే సరిచూసుకోవాలని బోర్డు సూచించింది. నకిలీ వెబ్సైట్లు, తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని అభ్యర్థులను హెచ్చరించింది. వైద్య విద్యలో పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ పీజీ పరీక్షను ఈ నెల 30న నిర్వహించనున్న విషయం తెలిసిందే.
మార్పులకు ఆగస్టు 15 వరకు అవకాశం ....
నీట్ పీజీ 2026 దరఖాస్తుల్లో నిబంధనలకు అనుగుణంగా లేని ఫొటో, సంతకం, వేలిముద్రలను సరిచేసుకునేందుకు ఎన్బీఈఎంఎస్ మరో అవకాశం కల్పించింది. ఆగస్టు 15 రాత్రి 11.55 గంటల వరకు అభ్యర్థులు మార్పులు చేసుకోవచ్చని తెలిపింది. నిర్ణీత గడువులోగా తప్పులను సరిచేయకపోతే దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అభ్యర్థులు ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్సైట్లో తమ వివరాలతో లాగిన్ అయి, అప్లోడ్ చేసిన ఫొటో, సంతకం, బొటనవేలి ముద్ర ఆమోదం పొందాయో లేదో పరిశీలించుకోవాలని సూచించింది. నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని గడువులోగా సరిచేయాలని పేర్కొంది. పరీక్ష నిర్వహణతో పాటు కౌన్సెలింగ్, ప్రవేశ ప్రక్రియ పూర్తయ్యే వరకు దరఖాస్తులో పేర్కొన్న ఈమెయిల్, మొబైల్ నంబర్ను అందుబాటులో ఉంచుకోవాలని బోర్డు సూచించింది. ముఖ్యమైన సమాచారాన్ని వాటి ద్వారా ఎప్పటికప్పుడు పంపే అవకాశం ఉన్నందున అభ్యర్థులు తరచూ పరిశీలించుకోవాలని తెలిపింది.








కామెంట్లు (0)