వెనిజులా చమురు క్షేత్రాలపై అమెరికా పాగా
ఒప్పందం ముసుగులో 17 సంస్థలపై పెత్తనం
నిస్సిగ్గుగా ప్రకటించిన వైట్హౌస్
న్యూయార్క్ : ఒకవైపు ఒక సార్వభౌమ ప్రజాతంత్ర దేశంలోకి అక్రమంగా చొరబడి ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను అపహరించుకొని వెళ్లి విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తూ..మరోవైపు అదే దేశంలో తన కీలుబొమ్మ పాలక పెద్దలతో ఒప్పందం చేసుకుంటున్నట్లు నటించి ఆ దేశంలోని చమురు నిల్వలన్నీ కోడి పిల్లలను తన్నుకొల్లిన గద్దలా అమెరికా తన వికృతరూపాన్ని మరోమారు ప్రపంచానికి నిస్సిగ్గుగా చాటుకుంటోంది. వెనిజులాతో కుదుర్చుకున్న చమురు ఒప్పందం వివరాలు ఇవిగో అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారిక భవనం వైట్హౌస్ తన వెబ్సైట్లో ‘ఫ్యాక్ట్ షీట్’ను పోస్టు చేసింది. ఒప్పందం ముసుగులో వెనిజులా నుంచి వందేళ్ల పాటు అధికారికంగా చమురును ఎలా దోపిడి చేయనుందో పేర్కొంది. వైట్హౌస్ పేర్కొన్న వివరాలు..ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా వెనిజులా తాత్కాలిక ప్రభుత్వం అమెరికాలో రెండో అతిపెద్ద ప్రైవేట్ చమురు ఉత్పత్తిదారైన నార్త్ అమెరికన్ బ్లూ ఎనర్జీ పార్టనర్స్ (ఎన్ఎబిఇపి) కి 17 చమురు క్షేత్రాలను వందేళ్ళ పాటు లీజుకు ఇచ్చింది. ఈ చమురు క్షేత్రాలు దాదాపు 6500 కోట్ల బారెళ్ళ చమురును ఉత్పత్తి చేస్తాయి. ఇందుకు ప్రతిగా ఎన్ఎబిఇపి తన కార్పొరేట్ మాతృ సంస్థలో 35 శాతం ఈక్విటీ వాటాలను అమెరికా యుద్ధ వ్యవహారాల కార్యాలయానికి మంజూరు చేసింది.
అంతేగాకుండా తాము నిర్వహించే చమురు క్షేత్రాల్లో ప్రస్తుతం, భవిష్యత్లో వచ్చే ఉత్పత్తిలో 20 శాతాన్ని ఉత్పత్తి వ్యయ రేటుకే కొనుగోలు చేసేందుకు హక్కును కూడా అమెరికా విదేశాంగ శాఖకు ఇచ్చింది. అలాగే అవసరమైతే మిగిలిన 80శాతం ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి మొదటి ప్రాధాన్యతా హక్కును కూడా ఇచ్చింది. ఎన్ఎబిఇపి డైరెక్టర్ల బోర్టులో ఎవరినైనా నియమించడాన్ని వీటో చేసే అధికారం అమెరికా ప్రభుత్వానికి వుంది. పైగా మెజారిటీ సభ్యులు అమెరికా పౌరులై వుండాలని ఆ ఫ్యాక్టషీట్ పేర్కొంటోంది. అమెరికా ప్రభుత్వం, ఎన్ఎబిఇపిల మధ్య కుదిరిన ఈ ఒప్పందం అమెరికా చట్ట నిబంధనలకు, అమెరికా కోర్టుల పరిధికి లోబడి వుంటుంది. వెనిజులా నుండి వచ్చే లక్షలాది బారెళ్ళ ముడి చమురు అమెరికా రిగ్స్, మౌలిక వసతులను ఉపయోగించుకునే శుద్ధి చేయడం జరుగుతుందని ఫ్యాక్టషీట్ పేర్కొంది.







కామెంట్లు (0)