న్యూఢిల్లీ:
భారతదేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ (Tarique Rahman) హాజరుకావడం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ సదస్సుకు బంగ్లాదేశ్ నుంచి ఎటువంటి ప్రభుత్వ ప్రతినిధి బృందం కూడా వెళ్లే అవకాశం లేదని సమాచారం.
ఈ విషయంపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయూన్ కబీర్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. "మా ప్రధానమంత్రికి బ్రిక్స్ సదస్సుకు నేరుగా ఆహ్వానం అందలేదు. బిమ్స్టెక్ (BIMSTEC) కూటమి అధ్యక్ష హోదాలోనే ఆహ్వానం పంపడం జరిగింది. అటువంటప్పుడు మా ప్రధాని ఈ సమావేశానికి ఎలా హాజరవుతారు?" అని ఆయన ప్రశ్నించారు. అందువల్ల ఈ సదస్సులో బంగ్లాదేశ్ పాల్గొనే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రకటనతో బ్రిక్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలు మరొకసారి చర్చనీయాంశంగా మారాయి. అనుకూలమైన సమయంలో భారత్తో ప్రత్యేక ద్వైపాక్షిక చర్చల కోసం ప్రధాని పర్యటన ఉండే అవకాశం ఉందని విదేశాంగ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.







కామెంట్లు (0)