బీజింగ్ : పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో చైనా శాస్త్రవేత్తలు భారీ ఖనిజ నిక్షేపాలను గుర్తించారు. సముద్ర గర్భంలో నిర్వహించిన పరిశోధనల్లో బంగారం, వెండితో పాటు రాగి, ఇనుము, జింక్ వంటి విలువైన ఖనిజాలు పెద్ద మొత్తంలో ఉన్నట్లు వెల్లడైంది.
సింఘువా యూనివర్సిటీ, షాంఘై జియావో టాంగ్ యూనివర్సిటీ సహా పలు సంస్థల పరిశోధకులు ‘జియాంగ్ యాంగ్ హాంగ్ 10’ నౌకలో చేపట్టిన పరిశోధనలో ఈ నిక్షేపాలను గుర్తించారు. సేకరించిన నమూనాలను నౌకలోని ప్రయోగశాలలో పరీక్షించగా ఒక టన్ను ఖనిజంలో 15.4 గ్రాముల వరకు బంగారం, 1,271 గ్రాముల వరకు వెండి ఉన్నట్లు తేలింది.
చైనా ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలోని సముద్ర ప్రాంతంలో 700 నుంచి 1,500 మీటర్ల లోతులో ఈ హైడ్రోథర్మల్ ఖనిజ క్షేత్రం ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఇక్కడ సముద్రపు నీటి ఉష్ణోగ్రత 315 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉంటుందని గుర్తించారు. మూడు పెద్ద శంఖాకార నిర్మాణాలతో ఉన్న ఈ ప్రాంతం భవిష్యత్తులో ప్రపంచస్థాయి సముద్రగర్భ ఖనిజ నిక్షేపంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
నిక్షేపాల పూర్తి పరిమాణం, ఆర్థిక విలువను అంచనా వేసేందుకు చైనా 2027లో మరింత విస్తృతమైన సర్వేలు నిర్వహించనుంది. అయితే ఇంతటి లోతులోని ఖనిజాలను వెలికితీయడం సాంకేతికంగా అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. ప్రస్తుతం ప్రపంచంలో ఇలాంటి లోతైన సముద్ర ప్రాంతాల్లో వాణిజ్య స్థాయిలో మైనింగ్ కార్యకలాపాలు జరగడం లేదు.








కామెంట్లు (0)