శుక్రవారం ప్రధాని మోడీతో భేటీ
మాస్కో: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం భారత్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని రష్యా అధ్యక్ష భవన ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మంగళవారం తెలిపారు. అలాగే, ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించేందుకు భారత్ చేసే ప్రయత్నాలను స్వాగతిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై మాస్కో, న్యూఢిల్లీ ఒకే విధమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయన్నారు. మాస్కో నుండి ఆన్లైన్ బ్రీఫింగ్లో మాట్లాడుతూ, ‘‘ఉక్రెయిన్ వివాదంపై భారత్ వైఖరి మాకు తెలుసు, అది చాలా వరకు మా వైఖరితో సరిపోలుతుంది. ఎందుకంటే ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత మార్గాల ద్వారానే పరిష్కారం లభించాలని మేము కోరుకుంటున్నాం’’ అని పెస్కోవ్ పేర్కొన్నారు.
రష్యా నుండి ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం సుంకాలు విధించాలన్న అమెరికా ప్రతిపాదిత చర్యను ‘‘చట్టవిరుద్ధమైనది, ఆమోదయోగ్యం కానిది’’గా ఆయన అభివర్ణించారు. కొత్త అణు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై భారత్తో చర్చలు జరిపేందుకు రష్యా ఎదురుచూస్తోందని కూడా పెస్కోవ్ తెలిపారు. అలాగే, భారత్కు సు-57 యుద్ధ విమానాల విక్రయం అంశం కూడా ఎజెండాలో ఉందన్నారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఈ నెల 11 నుండి 13 వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనుంది.







కామెంట్లు (0)