- 13 మంది భారతీయులతో సహా 14 మంది సిబ్బంది సురక్షితం
యెమెన్: ఎర్ర సముద్రంలో యెమెన్ తీరానికి సమీపంలో భారత సరుకు రవాణా నౌక ఎంఎస్వి ఫైజ్ నూరే ఓలియాపై దాడి జరిగింది. ఈ ఘటనలో నౌక అదుపుతప్పి పూర్తిగా సముద్రంలో మునిగిపోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దాడి అనంతరం నౌకలో ఉన్న 13 మంది భారతీయులు, ఒక యెమెన్ పౌరుడు సహా మొత్తం 14 మంది సిబ్బందిని యెమెన్ తీర రక్షక దళం సురక్షితంగా రక్షించింది. అనంతరం వారిని యెమెన్లోని మోఖా ఓడరేవుకు తరలించగా, అందరూ క్షేమంగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ఈ దాడికి హౌతీ తిరుగుబాటుదారులే కారణమని యెమెన్ జాతీయ ప్రతిఘటన దళాలు ఆరోపించాయి. అయితే, ఈ ఘటనపై హౌతీల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. రియాద్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, రక్షించబడిన భారతీయుల భద్రత కోసం యెమెన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.








కామెంట్లు (0)