60 రోజుల్లో తుది ఒప్పందం
బర్గెన్స్టాక్ (స్విట్జర్లాండ్): మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితిని ముగించే ప్రయత్నాల్లో భాగంగా స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్లో జరిగిన ఉన్నత స్థాయి అమెరికా-ఇరాన్ చర్చలు ముగిశాయి. ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో సాగిన ఈ చర్చల్లో 60 రోజుల్లో తుది ఒప్పందానికి చేరుకోవాలని ఇరు పక్షాలు ప్రాథమికంగా అంగీకరించారు. లెబనాన్లో సైనిక కార్యకలాపాలను ముగించాలని, హోర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించడానికి ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అంగీకరించారు. ఈ వారం రోజులు సాంకేతిక స్థాయి చర్చలు కొనసాగనున్నాయని దౌత్య వర్గాలు తెలిపాయి. ఈ చర్చల్లో అమలు విధానాలు, పర్యవేక్షణ యంత్రాంగంపై దృష్టి సారించనున్నారు.
చర్చల్లో గణనీయమైన పురోగతి ఉన్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తెలిపారు. చమురు ఎగుమతులపై ఆంక్షల సడలింపు, స్తంభింపజేసిన ఆస్తుల విడుదల వంటి అంశాలు ముందుకు కదిలినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే చర్చల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు కూడా కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లెబనాన్లో కార్యకలాపాలను నియంత్రించకపోతే ఇరాన్కు తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. దీనిపై ఇరాన్ కఠినంగా స్పందించింది. ట్రంప్ బెదిరింపులు అమెరికా నిస్సహాయతను చూపిస్తున్నాయని, తాము బెదిరింపులకు లొంగబోమని ఇరాన్ పేర్కొంది. తీవ్రమైన వివాదాలు ఉన్నప్పటికీ, చర్చలు పూర్తిగా విఫలం కాలేదని, తెరవెనుక చర్చల ద్వారా ఇరుపక్షాలను కలిపేందుకు మధ్యవర్తులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారని తెలిపింది.









కామెంట్లు (0)