అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత సమాజంలో మన జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఉరుకుల పరుగుల ఈ హడావుడి జీవితంలో భోజనం చేయడానికి తగినంత సమయం కేటాయించలేకపోతున్నాం. సరిగ్గా నమలకుండా, తొందర తొందరగా భోజనం చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. భోజనం చేసేటప్పుడు ఈ కింది నియమాలు పాటించాలి.
భోజనాన్ని కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో ముగించకూడదు. భోజనానికి కనీసం 20 నుంచి 30 నిమిషాలు కేటాయించాలి. నెమ్మదిగా, ప్రశాంతంగా కూర్చుని భోజనం చేయడం వల్ల మనసుకు, శరీరానికి ప్రశాంతత లభిస్తుంది.
ప్రతి ముద్దను 20 నుంచి 30 సార్లు నమలాలి. గట్టిగా ఉండే పదార్థాలను ఇంకా ఎక్కువసార్లు నమలాలి. నోట్లోనే ఆహారం మెత్తని ముద్దలా (పేస్టులా) మారేలా బాగా నమలడం వల్ల జీర్ణవ్యవస్థపై భారం తగ్గి, శరీరానికి పోషకాలు బాగా అందుతాయి.
ఆహారం నోటిలోని లాలాజలంతో కలిసి మెత్తగా మారడం వల్ల కడుపులో అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దరిచేరవు.
మనం తింటున్నప్పుడు కడుపు నిండిందనే సంకేతం మెదడుకు చేరడానికి కనీసం 20 నిమిషాలు పడుతుంది. త్వరత్వరగా తినడం వల్ల ఆ సంకేతం అందక ఎక్కువగా తినేస్తాం. అదే నెమ్మదిగా తినడం వల్ల అతిగా తినడాన్ని (Overeating) సహజంగానే నివారించవచ్చు.
ఎక్కువసార్లు నమలడం వల్ల ఆహారం చిన్నచిన్న ముక్కలుగా విడిపోయి, శరీరం పోషకాలను సులభంగా, పూర్తిగా గ్రహించే అవకాశం పెరుగుతుంది. భోజనం చేసేటప్పుడు టీవీ, మొబైల్ ఫోన్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఆహారంపైనే దృష్టి పెట్టి, ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ భోజనం చేయాలి.
- డాక్టర్ ఎంవి రమణయ్య,
ప్రజా వైద్యశాల, నెల్లూరు








కామెంట్లు (0)