ఎముకల ఆరోగ్యానికి అత్యంత అవసరమైన విటమిన్ డి–3 ఔషధం ఇప్పటివరకు ఎక్కువగా గొర్రెల ఉన్నిలో ఉండే లానోలిన్ వంటి జంతు మూలాల నుంచి తయారవుతుండేది. ఇప్పుడు తొలిసారిగా పూర్తిగా మొక్కల ఆధారంగా తయారైన స్వదేశీ విటమిన్ డి–3ను భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆమోదించింది. దీనిని ఆరోగ్య సప్లిమెంట్లు, పోషకాహార ఉత్పత్తులు, విటమిన్లు కలిపిన ఆహార పదార్థాలు, పానీయాల తయారీలో ఉపయోగించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ కొత్త ఉత్పత్తిని ఫెర్మెంటా బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసింది. మొక్కల నుంచి సేకరించిన ముడి పదార్థాలను ప్రత్యేక కిణ్వ ప్రక్రియ ద్వారా విటమిన్ డి–3గా మార్చే సాంకేతికతను ఇందులో ఉపయోగించారు. మొక్కల ఆధారిత విటమిన్ డి–3 అందుబాటులోకి రావడం పోషకాహార రంగంలో కీలక పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా శాకాహారులు, వీగన్లు, జంతు మూలాల నుంచి తయారైన ఉత్పత్తులను తీసుకోవడానికి ఇష్టపడని వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, విటమిన్ డి కోసం మాత్రలపైనే ఆధారపడకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ కొంతసేపు ఉదయం లేదా సాయంత్రం సూర్యరశ్మిలో గడపడం ద్వారా శరీరం సహజంగానే విటమిన్ డి ఉత్పత్తి చేసుకుంటుంది. అవసరమైతే మాత్రమే వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశంలో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది. పట్టణ జీవనశైలి, కార్యాలయాల్లో ఎక్కువసేపు గడపడం, సూర్యరశ్మికి తక్కువగా గురికావడం, ఆహారపు అలవాట్ల కారణంగా జనాభాలో గణనీయమైన శాతం మందిలో ఈ లోపం కనిపిస్తోంది. వివిధ అధ్యయనాల ప్రకారం దేశంలో 70 నుంచి 90 శాతం మంది వరకు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నట్లు అంచనాలు ఉన్నాయి. సూర్యరశ్మే సహజం
మొక్కల నుంచి విటమిన్ డి–3
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 12, 2026, 04:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)