సినిమా రచయిత, నటుడు, నాటక రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడు, గీత రచయితగా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసిన సంపూర్ణ కళాకారుడు మోదుకూరి జాన్సన్. గుంటూరు జిల్లా కొలకలూరులో రత్తమ్మ, గురవయ్య దంపతులకు 1936 ఆగస్టు 8న జన్మించారు. 1988 డిసెంబరు 24న కన్నుమూశారు. దుగ్గిరాల, గుంటూరులో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం తెనాలిలో కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. అప్పటికే తెనాలి సాహిత్య, నాటక, కళా కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది. అక్కడి సాహితీవేత్తలు, కళాకారులతో ఏర్పడిన పరిచయాలు ఆయన కళాభిరుచిని మరింత పెంచాయి. జాషువా సాహిత్య ప్రభావంతోపాటు నూతక్కి అబ్రహాము, పొన్నెకంటి పోతురాజు వంటి వారి సాహచర్యం ఆయన సృజనాత్మక వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది. గంభీరమైన స్వరంతో గాయకుడిగా, వేదికపై మంచి వక్తగా కూడా గుర్తింపు పొందారు.
నాటకరంగమే జాన్సన్ ప్రతిభకు తొలి ప్రధాన వేదిక. నాటకరచనతోపాటు నటనలోనూ రాణించారు. ‘నటనాలయం’, ‘దేవాలయం’, ‘హృదయాలయ’, ‘సిలువభారం’ వంటి నాటకాలు రాసి ప్రదర్శించారు. ఢిల్లీలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయ యువజనోత్సవాల్లో పాల్గొని బహుమతులు అందుకున్నారు. 1965లో ఆంధ్ర నాటక కళాపరిషత్తులో ప్రదర్శించిన ‘నటనాలయం’ ఉత్తమ రచనగా ఎంపికైంది. నాటక సమాజాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇందులో ప్రస్తావించారు. కళాకారుల జీవితాన్ని కూడా ఆవిష్కరించారు. కళకు ఉన్న సామాజిక బాధ్యతను చాటిచెప్పారు. నాటకం వినోదానికే పరిమితం కాకుండా సామాజిక చైతన్యానికి సాధన కావాలన్న దృక్పథం ఆయన రచనల్లో కనిపిస్తుంది. ‘పాపక్షమ’ వంటి నాటకాలతో క్రైస్తవ సమాజంలో చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. ‘ఢక్కాభిషేకం’లో వైద్య విద్యార్థుల ర్యాగింగ్ను ఇతివృత్తంగా తీసుకున్నారు. ‘బాధ్యత’లో నర్సుల సేవలను ప్రస్తావించారు. ‘నీరద’లో స్త్రీపై జరిగే అన్యాయాన్ని ప్రశ్నించారు. ‘నిచ్చెనమెట్లు’లో కులవ్యవస్థ, సామాజిక అసమానతలను ఎత్తిచూపారు. సామాజిక సమస్యలకు ఆయన నాటక రచనలో ప్రత్యేక స్థానం కల్పించారు.
‘నటనాలయం’ జాన్సన్ సినీ రంగ ప్రవేశానికి మార్గం వేసింది. ఆ నాటకాన్ని చూసిన అక్కినేని నాగేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు ఆయన ప్రతిభను గుర్తించారు. 1970లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ‘మరో ప్రపంచం’ చిత్రం రూపొందింది. అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రానికి సంభాషణల రచయితగా జాన్సన్కు అవకాశం లభించింది. నాటకరంగంలో సంపాదించిన అనుభవం ఆయనకు సినిమాకు ఎంతో ఉపయోగపడింది. నాటకీయతను, పాత్రల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి అది తోడ్పడింది. సంభాషణలకు అవసరమైన బలాన్ని కూడా ఇచ్చింది. అనంతరం ‘మానవుడు–దానవుడు’, ‘విచిత్ర దాంపత్యం’, ‘డబ్బుకు లోకం దాసోహం’, ‘కరుణామయుడు’, ‘ఇంద్రధనుస్సు’, ‘ఆంధ్ర కేసరి’, ‘దేశోద్ధారకులు’, ‘సోగ్గాడు’, ‘సాహసగాళ్ళు’ తదితర చిత్రాలకు సంభాషణలు రాశారు. దాదాపు 50 చిత్రాలకు ఆయన మాటలు అందించినట్టు ఆయన సినీ ప్రస్థానానికి సంబంధించిన వివరాలు చెబుతున్నాయి. జనరంజకమైన భాషలో సంభాషణలు రాయడం ఆయన ప్రత్యేకత. కథకు తగిన నాటకీయతను జోడించడంలోనూ ఆయనకు మంచి పట్టు ఉంది. నటుడిగానూ తన ప్రతిభను ప్రదర్శించారు.
సినిమా సంభాషణలతోపాటు గీత రచయితగా కూడా జాన్సన్ ప్రతిభ చాటుకున్నారు. ‘కరుణామయుడు’ చిత్రంలోని ‘కదిలింది కరుణరథం... సాగింది క్షమాయుగం’ పాట ఆయనకు మంచి పేరు తెచ్చింది. ‘పాడిపంటలు’లోని ‘మన జన్మభూమి... బంగారు భూమి’ పాటలో గ్రామీణ జీవితం, నేలతో మనిషికి ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించారు. ‘దేశోద్ధారకులు’లోని ‘స్వాగతం దొరా’ పాట కూడా గుర్తింపు తెచ్చింది. దాశరథి రాసిన పాటకు అప్పటికప్పుడే స్వరపరిచి పాడారు. ఈ సందర్భంగా సినారె ప్రశంసలు అందుకున్నారు. ఇది ఆయన సంగీత ప్రతిభకు మరో నిదర్శనం. ‘రాగ హృదయం’కు నేపథ్యగానం అందించారు. ‘ఛండాలిక’, ‘పైరుపాట’ వంటి సంగీత రూపకాలకు సంగీత దర్శకత్వం వహించారు.
అన్ని కళారూపాల్లో విస్తరించినప్పటికీ జాన్సన్ అంతరంగంలో కవి ఎప్పుడూ చైతన్యంగా ఉన్నారు. జాషువా సాహిత్యంలోని సామాజిక చైతన్యం ఆయనను బలంగా ప్రభావితం చేసింది. కులవివక్షపై నిరసన ఆయన రచనల్లో కనిపిస్తుంది. మానవ గౌరవం కోసం పోరాటం కూడా కనిపిస్తుంది. అణగారిన వర్గాల పట్ల సానుభూతి ఆయన రచనల్లో వ్యక్తమవుతుంది. ‘నిచ్చెనమెట్లు’లో కులవ్యవస్థను ప్రశ్నించారు. ‘మాతంగ సామ్రాట్ వీరబాహు’లో సామాజిక నిర్మాణాన్ని పరిశీలించారు. సున్నితమైన భావాలను పదునైన మాటలుగా మలచగలిగిన ఆయన కవితా స్వరాన్ని వాచస్పతి జగ్గయ్య గుర్తించారు. ఆయనకు ‘అగ్నికవి’ అనే బిరుదును ఇచ్చారు.
గాయకుడిగా ప్రారంభమైన జాన్సన్ ప్రయాణం నాటకరంగానికి విస్తరించింది. అక్కడి నుంచి నటన, సంగీతం, గీత రచన, సినిమా సంభాషణల వరకు సాగింది. ఒకే రంగానికి పరిమితం కాకుండా కళలోని వివిధ ప్రక్రియలను తన సృజనకు వేదికలుగా మలుచుకున్నారు. కళను వినోదంగా మాత్రమే కాకుండా సామాజిక చైతన్యానికి సాధనగా భావించారు. మాటల్లో, పాటల్లో, నాటకాల్లో అణగారిన మనిషి పట్ల ఆవేదనను వ్యక్తం చేశారు. సమానత్వం పట్ల ఆకాంక్షను చాటిచెప్పారు. మోదుకూరి జాన్సన్ తెలుగు కళా సాహిత్య రంగాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. దళిత సమాజం కోల్పోయిన ఆణిముత్యంగా ఆయన గుర్తుండిపోతారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, ముందుతరాలకు స్ఫూర్తినిచ్చిన కళాకారుడిగా ఆయన జ్ఞాపకం చిరస్థాయిగా నిలిచిపోతుంది.
- డా. వల్లూరి రామారావు
94908 77471







కామెంట్లు (0)