- మూడు నౌకలపై క్షిపణి దాడి
• ఇంధన సరఫరాకు ముప్పు?
లండన్ : ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒమన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న మూడు చమురు ట్యాంకర్లపై మంగళవారం తెల్లవారుజామున క్షిపణి దాడి జరగడంతో ఓ నౌకలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషయాన్ని యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యుకెఎంటిఒ) ధ్రువీకరించింది. ఈ దాడిపై ఇరాన్ ప్రభుత్వ మీడియా స్పందించింది. హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో నౌకను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపింది. యుకెఎంటిఒ వెల్లడించిన వివరాల ప్రకారం, హర్మూజ్ నుంచి ఒమన్ గల్ఫ్ వైపు దక్షిణ దిశగా ప్రయాణిస్తున్న ట్యాంక్పై లిమా ప్రాంతంలో సమీపంలో క్షిపణి తాకింది. నౌక ఎడమ వైపున క్షిపణి పడటంతో మంటలు చెలరేగాయి. అయితే ఈ ఘటన వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం లేదని పేర్కొంది.
ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే
ఇరాన్కు ట్రంప్ హెచ్చరికలు చేసిన కొద్ది గంటల్లోనే హార్ము జ్లో ఈ దాడులు జరిగాయి. సోమవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒప్పందానికి రావాలని లేకపోతే అమెరికా పని పూర్తి చేస్తుందని అన్నారు. ఆ పని చేయడం పెద్ద కష్టం కాదని గంటల వ్యవధిలోనే వారి వంతెలను కూల్చివేయగలమని, అలాగే విద్యుత్తు సరఫరాను నిలిపివేయగలమని పేర్కొన్నారు. ట్రంప్ హెచ్చరికలు, ఖమేనీ అంత్యక్రియలు కొనసాగుతున్న వేళ హర్మూజ్ లో ఈ దాడి జరగడం అంతర్జాతీయంగా ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ చమురు, సహజవాయువు రవాణాలో కీలకమైన ఈ సముద్ర మార్గంలో భద్రతా పరిస్థితులపై మళ్లీ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.








కామెంట్లు (0)