- పుతిన్ ఆదేశాలు
మాస్కో : ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై 72గంటల పాటు దాడులకు విరామం ఇవ్వాలని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారని క్రెమ్లిన్ శనివారం తెలిపింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య దీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధాన్ని నిలిపేందుకు జరిగిన ప్రయత్నాలు ప్రతిష్టింభించిన నేపథ్యంలో మళ్ళీ ఆ ప్రయత్నాలను గాడిన పడేసేందుకు అమెరికా రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ మాస్కో వచ్చారు. మాస్కో విమానాశ్రయంలో వారితో కలిసి దిగిన ఫోటోను పెస్కోవ్ పంచుకున్నారు. వారి పర్యటనను పురస్కరించుకునే మాస్కో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఆదివారం అమెరికా నేతలు కీవ్లో కూడా పర్యటించనున్నారు. శనివారం అర్ధరాత్రి నుండి మూడు రోజుల పాటు కీవ్పై ఎలాంటి దాడులకు దిగరాదని పుతిన్ ఆదేశాలు జారీ చేశారని అధ్యక్ష భవన ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్ రష్యా వార్తా సంస్థకు తెలిపారు. అమెరికా రాయబారుల పర్యటన నేపథ్యంలో తాము వైమానిక దాడులు నిలిపివేస్తామని, రష్యా కూడా ఇదేరీతిన స్పందించాలని శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఆ మేరకు రష్యాకూడా దాడులు నిలిపివేసింది.
ఇరు పక్షాల మధ్య యుద్ధాన్ని ఆపేసేందుకు ఒక పక్క దౌత్య ప్రయత్నాలు సాగుతున్నా మరోపక్క ఉభయ పక్షాల మధ్య వైమానిక దాడులు ఉధృతంగానే సాగుతూ వచ్చాయి. తాజాగా తీసుకున్న ఈ కాల్పుల విరమణతో దౌత్య ప్రయత్నాలు మరింత వేగంగా జరగడానికి అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు.







కామెంట్లు (0)