బీరూట్: ఇజ్రాయిల్ గురువారం దక్షిణ లెబనాన్పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. నబతీయ అల్-ఫౌకా మున్సిపాలిటీపై క్షిపణులతో విరుచుకుపడింది. గత మార్చి నెలలో ఇజ్రాయిల్, రెండేళ్లలోపే రెండోసారి లెబనాన్పై దాడికి దిగింది. 2024 అక్టోబర్లో జరిగిన మొదటి దాడి అనంతరం, ఇజ్రాయిల్ బలగాలు దాదాపుగా పూర్తిగా వెనక్కి వెళ్లినప్పటికీ, దక్షిణ లెబనాన్లోని ఐదు ప్రాంతాల్లో సైనికులు మిగిలిపోయారు. రెండో దాడి తర్వాత, తమకు భూభాగపరమైన ఆశయాలు లేవని అమెరికా అధికారులు హామీ ఇచ్చినప్పటికీ, తమ బలగాలు దక్షిణ లెబనాన్లోనే ఉంటాయని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది.
ఓడరేవును స్వాధీనం చేసుకున్న హౌతీలు..
ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు గురువారం యెమెన్లోని మోఖా ఓడరేవును స్వాధీనం చేసుకున్నారని హౌతీ, యెమెన్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఎర్ర సముద్రం మీదుగా సాగే నౌకాయానంపై నియంత్రణ సాధించడంలో ఈ ప్రాంతం అత్యంత కీలకమైనది. మోఖా, బాబ్ ఎల్-మందేబ్ జలసంధికి సుమారు 80 కిలోమీటర్ల (50 మైళ్ల) దూరంలో ఉంది. ఎర్ర సముద్రం, ఏడెన్ గల్ఫ్లను కలిపే ఈ వ్యూహాత్మక జలమార్గం గుండా ప్రపంచవ్యాప్తంగా జరిగే చమురు, ఇతర సరుకుల రవాణాలో దాదాపు 12 శాతం సాగుతుంది. గత ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయిల్ దాడుల అనంతరం ఇరాన్ హర్మూజ్ జలసంధి గుండా నౌకాయానానికి అంతరాయం కలిగించినప్పటి నుంచి, ప్రపంచ ఇంధన సరఫరాలకు బాబ్ ఎల్-మందేబ్ జలసంధి ప్రాధాన్యత మరింత పెరిగింది. 2022లో దశాబ్దానికి పైగా సాగిన అంతర్యుద్ధాన్ని ముగించేందుకు కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం, హౌతీలు సాధించిన అతిపెద్ద భూభాగ విజయం ఇదే. పూర్తిస్థాయి అంతర్యుద్ధం మళ్లీ చెలరేగితే, అది యెమెన్ ప్రజలకే కాక ప్రపంచ ఇంధన సరఫరాలకు కూడా తీవ్ర విఘాతం కలిగించే ప్రమాదం ఉందని పలువురు భావిస్తున్నారు.








కామెంట్లు (0)