హర్మూజ్పై పట్టు మాదేనన్న ఇరాన్
టెహ్రాన్, వాషింగ్టన్ : అమెరికాతో చర్చలు జరపాలని తాము కోరుకోవడం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ సోమవారం తెలిపింది. ఉభయ పక్షాల మధ్య పోరు నిలిచినప్పటికీ ప్రస్తుతం తామెంటువంటి చర్చలు జరపడం లేదని తెలిపింది. వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిపై కూడా తమకే నియంత్రణ వుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘై మీడియా సమావేశంలో తెలిపారు. చర్చలు కావాలని ఇరానే అభ్యర్ధించిందన్న వాదనను కొట్టిపారేశారు. అలాగే హర్మూజ్ నియంత్రణపై ఒమన్తో ఇటీవల జరిపిన చర్చల్లో అమెరికా ప్రమేయం ఏమీ లేదని కూడా ఆయన తేల్చి చెప్పారు. అమెరికాకు ఈ చర్చలకు ఎలాంటి సంబంధం లేదు. ఇరాన్, ఒమన్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశం, ఆ చర్చలు కొనసాగుతున్నాయని బాఘై తెలిపారు. ప్రస్తుతానికి హర్మూజ్ మూసివేసి వుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నుండి ఇరుపక్షాలు దాడులు ఆపడంతో గల్ఫ్ ప్రాంతంలో నౌకలు, చమురు పరిశ్రమపై క్షిపణి దాడులకు ఉపశమనం లభించినట్లైంది. కాగా చర్చలకు కొంత వెసులుబాటు కల్పించే ఉద్దేశ్యంతోనే ఈ విరామం ఇవ్వాలని అధ్యక్షుడు ట్రంప్ భావించినట్లు ఐక్యరాజ్య సమితిలో అమెరికా తరపున రాయబారి మైక్ వాల్ట్ వ్యాఖ్యానించారు. ఈ నెల 24వ తేదీకి ముందు వరకు వరుసగా 13 రోజుల పాటు అమెరికా మిలటరీ ఇరాన్పై దాడులు కొనసాగించింది.
ఎర్ర సముద్రంలో మందకొడిగా ట్రాఫిక్
ఎర్ర సముద్రం తీర ప్రాంతం పొడవునా సౌదీ చమురు సంస్థలపై ఎమెన్ హౌతీలు దాడులు జరపడంతో ఆదివారం బాబెల్ మాండెబ్ జలసంధిలో నౌకల రాకపోకలు మందగించాయి. అలాగే హర్మూజ్లో కూడా ఈ వారంతంలో రవాణా తగ్గిందని కెప్లర్ షిప్పింగ్ డేటా సోమవారం తెలియచేసింది. ఆదివారం మాండెబ్ జలసంధిలో కేవలం 11 నౌకలు మాత్రమే రవాణా సాగించాయి. ఇటీవల నెలల్లో ఇదే అత్యంత తక్కువ స్థాయి.







కామెంట్లు (0)