- ఆరుగురు మృతి
గాజా: గాజా నగరంలో ఇజ్రాయిల్ మరోసారి దాడి చేసింది. నగర ఓడరేవు సమీపంలోని రద్దీగా ఉండే ఓ కేఫ్పై జరిగిన ఈ దాడిలో ఆరుగురు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు మీడియా నివేదికలు వెల్లడించాయి. ఈ కేఫ్ శరణార్థుల శిబిరంగా కూడా ఉపయోగిస్తున్న ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. తీవ్రమైన ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఓడరేవు సమీపంలోని గుడారాల నుంచి ప్రజలు బయటకు వచ్చిన సమయంలో ఈ దాడి జరిగినట్లు మీడియా తెలిపింది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా దాడులు జరుగుతుండటంతో.. వీధుల్లో నడుస్తున్నా, కేఫ్లలో కూర్చున్నా ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వైఖరిపై వివాదం కొనసాగుతోంది. అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ ఇజ్రాయిల్ గాజాలో సైనిక చర్యలను కొనసాగిస్తోందని నివేదికలు పేర్కొంటున్నాయి. హమాస్ ముందుగా ఆయుధాలను వదిలి లొంగిపోవాలని నెతన్యాహు డిమాండ్ చేస్తున్నారు. హమాస్ మాత్రం ఇజ్రాయిల్ సైన్యం గాజా నుంచి పూర్తిగా వైదొలిగినప్పుడే ఆయుధాలను వదులుకుంటామని చెబుతోంది. ప్రస్తుతం గాజాలో సుమారు 60 శాతం ప్రాంతం ఇజ్రాయిల్ సైన్యం ఆధీనంలో ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజా దాడి గాజాలో కొనసాగుతున్న మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.







కామెంట్లు (0)