10 మంది మృతి.. 62 మందికి గాయాలు
లాపాజ్ : దక్షిణ అమెరికా దేశమైన బొలీవియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని లాపాజ్కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని వియాచా మున్సిపాలిటీలో సైనిక స్థావరంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం 10 మంది మృతి చెందగా, 62 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య 10 నుంచి 15 వరకు ఉండొచ్చని స్థానిక ఆరోగ్య శాఖ డైరెక్టర్ రీటా నెబ్రాస్కా తెలిపారు.
సైనిక స్థావరంలోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పైరోటెక్నిక్ పదార్థాల నిల్వ ప్రాంతంలో పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్ల కిటికీలు ధ్వంసమయ్యాయి. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది పౌరులేనని అధికారులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, వైద్య, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. మరో పేలుడు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించి, ప్రజలు ఘటనాస్థలానికి కనీసం 150 మీటర్ల దూరంలో ఉండాలని సూచించారు. పేలుడుకు గల కారణాలపై ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది.







కామెంట్లు (0)