న్యూయార్క్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధిపతి మోహన్ భగవత్ హాజరుకానున్న మాడిసన్ స్క్వేర్ గార్డెన్ కార్యక్రమానికి తాను మద్దతు ఇవ్వడం లేదని న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ మంగళవారం స్పష్టం చేశారు. అయితే, ఇది ప్రైవేట్ కార్యక్రమం కావడంతో దాన్ని రద్దు చేసే అధికారం నగరానికి ఉందో లేదో తనకు తెలియదని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా భగవత్ అమెరికా పర్యటనకు చేరుకున్నారు. ఆగస్టు 29న మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో సుమారు 5,000 మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విలేకరుల సమావేశంలో మమ్దానీ మాట్లాడుతూ.. “నేను ఈ ర్యాలీకి మద్దతు ఇవ్వను. అయితే ఒక ప్రైవేట్ కార్యక్రమాన్ని రద్దు చేసే అధికారం నగరానికి ఉందో లేదో నాకు తెలియదు” అని అన్నారు. తాను భారతీయ-అమెరికన్ కుటుంబానికి చెందిన వ్యక్తినని పేర్కొన్న మమ్దానీ.. భారతదేశం బహుళత్వం, లౌకికత, అందరికీ చోటు కల్పించే సమాజంగా ఉండాలనే విలువలను తన కుటుంబం నుంచి నేర్చుకున్నానన్నారు. ఏ దేశాన్నైనా లేదా వర్గాన్నైనా బహిష్కరించే భావజాలంపై ఆధారపడిన ఉద్యమం పెరగడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. భగవత్ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ న్యూయార్క్ సిటీ హాల్ వెలుపల పలు పౌర హక్కులు, మత సామరస్య సంస్థలు కూడా నిరసన చేపట్టాయి. హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్, ఇంటర్ఫెయిత్ సెంటర్ ఆఫ్ న్యూయార్క్ తదితర సంస్థలు కార్యక్రమాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశాయి.
భగవత్కు ఆతిథ్యం ఇస్తున్న ‘ఎహెడ్ ఫోరమ్’ ఆగస్టు 29న జరిగే ‘యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్’కు ఆయన హాజరవుతారని ప్రకటించింది. “ప్రపంచం ఒకే కుటుంబం” అనే సందేశాన్ని చాటడమే కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.







కామెంట్లు (0)