- జలమయమైన రహదారులు, ట్రాఫిక్ అస్తవ్యస్తం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం కావడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. రాబోయే రోజుల్లోనూ ఉరుములు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కొనసాగవచ్చని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో సుమారు 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుతోంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో పలు మార్గాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో 18 విమాన సర్వీసులు రద్దు కాగా.. 400కు పైగా విమానాలు ఆలస్యమైనట్లు సమాచారం. విమానయాన సంస్థలు ప్రయాణికులు తమ విమానాల తాజా స్థితిని ముందుగా తెలుసుకున్న తర్వాతే విమానాశ్రయానికి రావాలని సూచించాయి. ఇదిలా ఉండగా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో వర్షాలు మరింత తీవ్రతరం అయితే ముంపు ప్రాంతాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.







కామెంట్లు (0)