- ఇరాన్ వాణిజ్య నౌకపై దాడి, ఒకరి మృతి
టెహ్రాన్ : హర్మూజ్ జలసంధిలోని ఖేష్మ్ దీవి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఒక ఇరాన్ వాణిజ్య నౌకపై దాడి జరిగిందని, ఇందులో ఒకరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారని ఇరాన్ వెల్లడించింది. అయితే, ఈ దాడికి ఉగ్రవాద శత్రువుదే బాద్యత అని ఖేష్మ్ గవర్నర్ విమర్శించారు. గతంలో ఇరాన్ నౌకలపై దాడి చేసిన అమెరికా తాజా ఘటనపై స్పందించ లేదు. బందర్ అబ్బాస్ ఓడరేవు నగరానికి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖేష్మ్ దీవి, జలసంధి గుండా రాకపోకలపై నియంత్రణకు అత్యంత కీలకమైనది. ఈ దాడుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు, సంబంధిత ఉత్పత్తుల ధరలు పెరిగాయి. అలాగే, హర్మూజ్ జలసంధికి అవతలి వైపున ఉన్న ఒమన్తో నౌకల రవాణాపై చర్చలు జరగుతున్నాయని ఇరాన్ తెలిపింది. అయితే, ఒమన్తో జలసంధిపై ఒప్పందం కుదిరినంత మాత్రాన షిప్పింగ్ కోసం దాన్ని తెరుస్తామని అర్థం కాదని, అమెరికా దిగ్బంధనాన్ని విరమించే వరకూ హర్మూజ్ను తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది.








కామెంట్లు (0)