మాస్కో : భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్ అన్ని రంగాల్లో అద్భుతమైన పురోగతి సాధిస్తోందని, అంతర్జాతీయ వేదికపై కీలక పాత్ర పోషిస్తోందని ఆయన ప్రశంసించారు. భారత్ ఆర్థిక, సామాజిక, సైన్స్, సాంకేతిక రంగాల్లో అద్భుతమైన పురోగతిని సాధిస్తోందని అన్నారు. రష్యా, భారత్ సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్ఫూర్తితో విజయవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఐక్యరాజ్యసమితి, షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ), బ్రిక్స్ వంటి అంతర్జాతీయ వేదికల్లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇరు దేశాల మధ్య సహకారం మరింత బలోపేతం అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తమ ఉమ్మడి కృషి ద్వారా, తమ స్నేహపూర్వక ప్రజల ప్రయోజనం కోసం, అంతర్జాతీయ భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో, నిర్మాణాత్మక రష్యా,భారత భాగస్వామ్యాన్ని తాము బలోపేతం చేస్తూనే ఉంటామని తనకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు.
భారత్, రష్యా మధ్య వాణిజ్య, రవాణా అనుసంధానాన్ని మరింత పెంచేందుకు చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆర్కిటిక్ ప్రాంతంలోని ఉత్తర సముద్ర మార్గం (ఎన్ఎస్ఆర్) ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఉత్తర సముద్ర మార్గం ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ ఉత్తర–దక్షిణ రవాణా కారిడార్, చెన్నై–వ్లాడివోస్టాక్ సముద్ర మార్గాలకు అదనపు అనుసంధాన మార్గంగా ఉపయోగపడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలో నావిగేషన్ కోసం భారతీయ నావికులకు శిక్షణ ఇవ్వడం సహా సముద్ర, ఆర్కిటిక్ రంగాల్లో రష్యాతో దీర్ఘకాలిక సహకారాన్ని భారత్ కొనసాగించనుంది.








కామెంట్లు (0)