ఇరాన్పై పది రోజులుగా అమెరికా వైమానిక దాడులు
హర్మూజ్పై పట్టు కోసం కుటిల యత్నాలు
ధీటుగా ఇరాన్ ప్రతిదాడులు
టెహ్రాన్, వాషింగ్టన్ :అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదంతో పశ్చిమాసియాలో సంక్షోభం మరింతగా ముదరుతోంది. ఇరాన్లో అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్తో కలిసి అమెరికా వైమానిక దాడులకు తెగబడుతోంది. కాల్పుల విరమణను ఉల్లంఘించి పది రోజులుగా ఈ దాడులకు పాల్పడుతోంది. దీంతో ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ప్రతి దాడులు చేస్తోంది. హర్మూజ్ను పూర్తిగా తన నియంత్రణలో ఉంచుకునేందుకు చర్యలు చేపడుతోంది.
అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్పై పట్టు కోసం పోరు కొనసాగుతోంది. ఇరాన్పై వరుసగా మంగళవారం కూడా అమెరికా దాడులు కొనసాగించింది. వరుసగా పది రోజుల నుండీ అమెరికా వైమానిక దాడులు జరుపుతున్నా హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టును సడలించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే హర్మూజ్లో తన హెచ్చరికలను ఖాతరు చేయని ఒక ట్యాంకర్పై మంగళవారం తెల్లవారు జామున ఇరాన్ దాడి చేసింది. దీంతో ఆ నౌక సిబ్బంది నౌకను వదిలిపెట్టాల్సి వచ్చింది. ఇరు పక్షాల మధ్య యుద్ధం పూర్తి స్థాయిలో పెచ్చరిల్లుతున్నప్పటికీ ఇరాన్ హోం మంత్రి చర్చల కోసం పాకిస్తాన్కు వెళ్ళారు. అయితే, ఈ పోరును అంతమొందించడానికి కొత్త ఒప్పందం ఏమి కుదురుతుందనే విషయమై ఎలాంటి స్పష్టత లేదు. యుద్ధానికి అంతం పలికేందుకు ఉద్దేశించిన, గత నెల్లో కుదిరిన తాత్కాలిక ఒప్పందం పూర్తిగా విచ్ఛిన్నమైంది. హర్మూజ్లో నౌకలన్నీ నిలిచిపోయాయి. యుద్ధం ముదురుతుండడంతో ఇరు పక్షాలూ ఇక పౌర సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆరంభించాయి.
మరోవైపు ఇరాన్ మత పెద్ద ముజ్తబా ఖమేనీ కార్యాచరణ రోజు రోజుకు పెరుగుతోందని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతున్న వీడియో ఒకటి ఇరాన్ ప్రభుత్వ మీడియాలో వచ్చింది. తన తండ్రి ఖొమేనీ చనిపోయిన దాడిలో ముజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుండి ఆయన బయటి ప్రపంచానికి కనబడడం లేదు. అయితే కీలక వ్యవహారాలు, నిర్ణయాలన్నీ ఆయనే చూస్తున్నారని ఇరాన్ నేతలు చెబుతున్నారు.
ఇంధన సరఫరాలపై ఐఎఇఎ ఆందోళన
రోజు రోజుకు పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలతో ఇంధన సరఫరాలపై ఆందోళనలు పెరుగుతున్నాయని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఎఇఎ) డైరెక్టర్ ఫతే బిరోల్ వ్యాఖ్యానించారు. అయితే ఆ ప్రభావాన్ని తట్టుకునే పరిస్థితులు ఇప్పటికీ మార్కెట్లో వున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైతే ముడి చమురు మార్కెట్లు అనేక అంశాల కారణంగా ప్రయోజనం పొందుతున్నాయన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ల నుండి చమురు మార్కెట్లకు చేరుతోందన్నారు. అనేక దేశాల నుండి ఎగుమతులు కూడా పెరిగాయన్నారు.








కామెంట్లు (0)