5జి, ఎఐ కోసం కాదు..
కార్నింగ్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో 5జి, ఎఐ వంటి కొత్త ఫీచర్ల కోసం కాకుండా స్మార్ట్ఫోన్ డిస్ప్లే పగలడం వల్లే కొత్త ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు.
నిర్ణీత కాలానికి కంటే ముందు కొత్త ఫోన్ కొనుగోలు చేయడానికి డిస్ప్లే పగలడమే ప్రధాన కారణమని కార్నింగ్ తాజా సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 1,509 మంది స్మార్ట్ఫోన్ వినియోగదారులపై నిర్వహించిన అధ్యయనంలో 53 శాతం మంది స్క్రీన్ గ్లాస్ పగలడం వల్లే కొత్త ఫోన్ కొనాల్సి వచ్చింది. గతేడాది తమ ఫోన్ కనీసం ఒక్కసారైనా కిందపడిందని 87 శాతం మంది చెప్పారు. డిస్ప్లే గ్లాస్ మన్నికపై 56 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఫోన్ కిందపడటంతో ఐదుగురిలో ఒకరి ఫోన్కు నిపుణుల రిపేర్ లేదా పూర్తిస్థాయి రీప్లేస్మెంట్ అవసరమైంది. సగానికి పైగా వినియోగదారులు రిపేర్ కోసం రూ.2,000కు మించి ఖర్చు చేసినట్లు సర్వే తెలిపింది.
మన్నిక అనేది ఇక ఎంతమాత్రం రెండో ప్రాధాన్య అంశం కాదని, డివైజ్ అనుభవంలో ప్రధాన భాగంగా మారిందని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ బెక్ తెలిపారు. మెజారిటీ వినియోగదారులు కొత్త ఫోన్ కొనేటప్పుడు మన్నిక ప్రమాణాలను చూస్తున్నారన్నారు. స్క్రీన్ దెబ్బతినడం ప్రీమియం, బడ్జెట్ ఫోన్ల వినియోగదారులపై సమాన ప్రభావం చూపుతోంది. డిస్ప్లే పగిలితే కొత్త ఫోన్ కొనుగోలు చేస్తామని 61 శాతం ప్రీమియం ఫోన్ వినియోగదారులు, 42 శాతం బడ్జెట్ ఫోన్ వినియోగదారులు తెలిపారు. కొత్త ఫోన్ కొనుగోలు సమయంలో 61 శాతం మంది మన్నికకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బ్యాటరీ లైఫ్, డివైజ్ మన్నికకు 63 శాతం, డిస్ప్లే స్పష్టతకు 58 శాతం, డ్రాప్ ప్రొటెక్షన్కు 52 శాతం, కెమెరా లెన్స్ మన్నికకు 53 శాతం, స్క్రాచ్ రెసిస్టెన్స్కు 48 శాతం మంది ప్రాధాన్యం ఇస్తున్నారని కార్నింగ్ తెలిపింది.








కామెంట్లు (0)