- అల్యూమినియం స్క్రాప్పై 15 శాతం సుంకాలు వెనక్కి..
- యూరోపియన్ యూనియన్ వెల్లడి
న్యూఢిల్లీ: భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టిఎ) చర్చలకు ఎలాంటి అడ్డంకులు రాకుండా యూరోపియన్ యూనియన్ (ఇయు) కీలక నిర్ణయం తీసుకుంది. అల్యూమినియం స్క్రాప్ ఎగుమతులపై 15 శాతం సుంకం విధించాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. భారత్, వియత్నాంలకు మినహాయింపు ఇచ్చే అంశాన్ని సెప్టెంబర్ 23న ప్రకటించాలని తొలుత భావించినప్పటికీ.. భారత్తో వాణిజ్య ఒప్పందంపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఈయూ వెనక్కి తగ్గినట్లు సమాచారం. యూరప్లో కఠిన పర్యావరణ నిబంధనలు, పెరుగుతున్న ఇంధన వ్యయాలతో అల్యూమినియం పరిశ్రమ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో స్థానిక స్మెల్టర్లను రక్షించడంతో పాటు రీసైక్లింగ్ను ప్రోత్సహించేందుకు అల్యూమినియం స్క్రాప్ ఎగుమతులపై మూడేళ్ల పాటు 15 శాతం సుంకం విధించాలని ఇయు ప్రతిపాదించింది. ఇయు నుంచి ఎగుమతవుతున్న అల్యూమినియం స్క్రాప్లో దాదాపు మూడో వంతును భారత్ దిగుమతి చేసుకుంటోంది. సుంకం ప్రతిపాదనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు మినహాయింపు ఇవ్వాలని బ్రస్సెల్స్ను కోరింది. డిసెంబర్లో ఇయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, ప్రధాని నరేంద్ర మోడీ మధ్య వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. 2019తో పోలిస్తే 2025 నాటికి ఇయు నుంచి అల్యూమినియం స్క్రాప్ ఎగుమతులు 51 శాతం పెరిగి 1.26 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరాయి. ఎగుమతులపై నియంత్రణలు తొలగిపోవడం వల్ల ఐరోపా రీసైక్లింగ్ పరిశ్రమ మరింత ఒత్తిడికి గురై, కొన్ని ప్లాంట్లు మూతపడే ప్రమాదం ఉందని పారిశ్రామిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి.








కామెంట్లు (0)