- మెరుగైన అవకాశాల కోసం వైదొలగుతున్నట్లు ప్రకటన
ముంబయి : దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసి) చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో) సునీల్ అగర్వాల్ తన పదవికి రాజీనామా చేశారు. మెరుగైన వృత్తిపరమైన అవకాశాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. జూలై 14, 2026న తర్వాత ఆయన రాజీనామా అమల్లోకి వస్తుందని ఎల్ఐసీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఆ తేదీ నుంచి ఆయన సంస్థ సీఎఫ్వోగా, కీలక నిర్వాహక సిబ్బందిగా కొనసాగరని తెలిపింది. సునీల్ అగర్వాల్ సంస్థకు అందించిన సేవలను అభినందిస్తూ, భవిష్యత్లో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఎల్ఐసీ ఆకాంక్షించింది. సంస్థ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు ముందు 2022 మార్చిలో ఆయన సీఎఫ్వోగా బాధ్యతలు స్వీకరించారు. ఎల్ఐసీలో చేరకముందు ఆయన రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ లో 12 ఏళ్లకు పైగా, అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఐదేళ్లకు పైగా పనిచేశారు. బి.ఇ., చార్టర్డ్ అకౌంటెంట్ అర్హతలు కలిగిన ఆయనకు మొత్తం 26 సంవత్సరాల వృత్తిపరమైన అనుభవం ఉంది.
భీమా రంగంలో కొత్త సంస్థలు, జాయింట్ వెంచర్లు ప్రవేశిస్తున్న సమయంలో ఎల్ఐసీ కీలక అధికారిగా ఉన్న అగర్వాల్ రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది.







కామెంట్లు (0)