- ఆంథ్రోపిక్ సేఫ్టీ టీమ్ మాజీ పరిశోధకుడు జో బెంట్న్
శాన్ఫ్రాన్సిస్కో : మానవులను మించిన మేధస్సు కలిగిన వ్యవస్థలను సృష్టించే క్రమంలో కంపెనీలు చేస్తున్న ఈ పరుగు, ప్రజలకు అంచనా అందనంత ప్రమాదకరంగా మారుతోందని ప్రముఖ ఎఐ సంస్థ ఆంథ్రోపిక్ సేఫ్టీ టీమ్కు చెందిన మాజీ పరిశోధకుడు జో బెంట్న్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఆయన గురువారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. మానవులను మించే మేధస్సు కలిగిన ఎఐ వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు కంపెనీలు పోటీపడుతున్నప్పటికీ.. వాటి వల్ల తలెత్తే ప్రమాదాలపై తగినంత పెట్టుబడులు పెట్టడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 11న సంస్థను వీడినట్లు వెల్లడించిన బెంట్న్.. ఎఐ ప్రమాదాలపై స్వతంత్ర పరిశోధనలు చేసే ఎంఇటిఆర్లో చేరనున్నట్లు తెలిపారు.
ఎఐ వ్యవస్థలపై నియంత్రణ కోల్పోయే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందన్నారు. బయటి ప్రపంచానికి తెలియకుండానే మానవ నియంత్రణ లేకుండా ఎఐ తనను తాను వేగంగా మెరుగుపరుచుకుంటూ మానవ మేధస్సును దాటిపోవచ్చన్నారు. ఈ ‘ఇంటెలిజెన్స్ ఎక్స్ప్లోషన్’ తో ప్రమాదం పొంచి ఉందని బెంట్న్ హెచ్చరించారు. ప్రజలకు ఈ ముప్పులపై అవగాహన కల్పించేందుకే సంస్థ వెలుపల నుంచి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇటీవల ఆంథ్రోపిక్ను వీడిన జాకబ్ కాక్సన్ కూడా స్వీయ అభివృద్ధి చెందే సూపర్ఇంటెలిజెన్స్ వైపు కంపెనీలు వేగంగా అడుగులు వేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఓపెన్ఎఐకి చెందిన జైన్ లీకే, ఇల్యా సుత్స్కేవర్ తదితరులు కూడా ఎఐ భద్రతపై విభేదాలతో సంస్థను వీడారు.








కామెంట్లు (0)