చెన్నై: తమిళనాడులో అధికారిక కార్యక్రమాల నిర్వహణలో పాటించే ప్రోటోకాల్పై మరోసారి వివాదం చెలరేగింది. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభంలో 'తమిళ్ తాయ్ వాజ్తు' (తమిళ ప్రార్థనా గీతం)ను ఆలపించే సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ 21 మంది పార్లమెంట్ సభ్యులు గవర్నర్ ఆర్.ఎన్. రవికి లేఖ రాశారు. బుధవారం ఎంపిలు గవర్నర్కు ఈ లేఖను పంపినట్లు సమాచారం. గత నెల 28న తిరునెల్వేలిలోని మనోన్మనీయం సుందరనార్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 33వ స్నాతకోత్సవాన్ని వారు ప్రస్తావించారు. రాజ్ భవన్ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని 'వందేమాతరం'తో ప్రారంభించి, అనంతరం జాతీయ గీతం ఆలపించారని, ఆ తర్వాత 'తమిళ్ తాయ్ వాజ్తు'ను ఆలపించారని అన్నారు. అంటే తమిళ ప్రార్థనా గీతాన్ని మూడో స్థానంలో ఉంచారని ఎంపీలు పేర్కొన్నారు. 2021లో 'తమిళ్ తాయ్ వాజ్తు'కు అధికారిక రాష్ట్ర గీత హోదా లభించిందని, గత ఐదు దశాబ్దాలుగా బహిరంగ కార్యక్రమాల ప్రారంభంలో దీనిని ఆలపించడం ఆనవాయితీగా కొనసాగుతోందని గుర్తుచేశారు.
రాష్ట్ర గీతాన్ని మూడో స్థానంలో ఉంచడం తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్యగా, అలాగే 'నీరారుమ్ కడలుడుత్త' రాష్ట్ర గీత రచయిత మనోన్మనీయం సుందరనార్ పిళ్ళైకి జరిగిన ‘తీరని అవమానం’గా ప్రజలు భావిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. అలాగే, జూన్ 2026లో తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా కార్యక్రమం 'తమిళ్ తాయ్ వాజ్తు'తో ప్రారంభమై, అనంతరం జాతీయ గీతం ఆలపించారని, విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో మాత్రం భిన్నమైన విధానం అనుసరించారని ఎంపీలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో రాష్ట్ర గీతాల విషయంలో అమలవుతున్న సంప్రదాయాలను కూడా వారు ఉదహరించారు. స్నాతకోత్సవాలు, ఇతర అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో 'తమిళ్ తాయ్ వాజ్తు'ను, ముగింపులో జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించేలా తమిళనాడులోని అన్ని విశ్వవిద్యాలయాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని రాజ్ భవన్ను వారు కోరారు. రాష్ట్ర గీతం లేదా మనోన్మనీయం సుందరనార్ పట్ల ఎలాంటి అగౌరవ భావన లేదని అధికారికంగా స్పష్టం చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.
ఈ లేఖపై పి. చిదంబరం, బి. మాణిక్యం ఠాగూర్, కార్తీ చిదంబరం, తోల్. తిరుమావళవన్, దురై వైకోతో పాటు తమిళనాడుకు చెందిన మరో 16 మంది ఎంపీలు సంతకాలు చేశారు. రాష్ట్ర సంస్థలు గౌరవప్రదంగా, అనవసర వివాదాలకు తావులేకుండా పనిచేసేలా చూడాలన్న ఉద్దేశంతోనే ఈ విజ్ఞప్తి చేస్తున్నామని, దీనిని ఫిర్యాదుగా కాకుండా గౌరవపూర్వక అభ్యర్థనగా పరిగణించాలని వారు లేఖలో పేర్కొన్నారు. ఈ అంశంపై రాజ్ భవన్ ఇప్పటివరకు స్పందించలేదు. ఇదివరకు జరిగిన మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా 'తమిళ్ తాయ్ వాజ్తు'ను కార్యక్రమ క్రమంలో మూడో స్థానంలో ఉంచినట్లు పేర్కొంటూ, అధికారిక ప్రోటోకాల్లో రాష్ట్ర గీతానికి వరుసగా మూడోసారి ఇదే స్థానం దక్కడం రాజకీయ విమర్శలకు దారితీసిందని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.








కామెంట్లు (0)